
ఈ దేశంలో ఒక్కసారి సర్పంచ్ అయితే చాలు భారీగా సంపాదిస్తారు. కానీ ఓ ఎంపీ అయితే మాటలా. లెక్కనేన్ని ఆస్తులను, కోట్లను కూడబెడతారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదిస్తారు. మరి ఖరీదైన గిఫ్టులు ఇస్తే ఎవరైనా ఊరుకుంటారా..చేయి చాపుతారు. నిస్సిగ్గుగా తీసేసుకుంటారు. కానీ ఓ ఎంపీ మాత్రం తాను వీటికి భిన్నమని చెప్పకనే చెప్పారు. తోటి ఎంపీలు తలదించుకునేలా చేశారు. ఇంతకీ ఎవరీ ఎంపీ అనుకుంటున్నారా, ఆయన కథ ఏమిటో తెలుసు కోవాలని ఉందా. అయితే ఇది తప్పకుండా చదవాల్సిందే.
ఖరీదైన బహుమతులు ఉచితంగా వస్తే తీసుకోకుండా ఎవరైనా ఉంటారా. ఎగిరి గంతేస్తారు. తీసుకునేందుకు బారులు తీరుతారు. కానీ బీహార్ కు చెందిన సుదామ ప్రసాద్ మాత్రం తనకు వద్దంటూ తిరిగి పంపించారు. ప్రస్తుతం ఆయన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. సోషల్ మీడియాలో ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. ఇంతకూ ఆ ఖరీదైన గిఫ్టులు అందజేసింది ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ సీఎం రమేష్. ఆయన రైల్వే స్టాండింగ్ కమిటీకి చైర్మన్ గా ఉన్నారు .
ఇక ఎవరీ సుదామ అనుకుంటున్నారా ..ఆయన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐఎంఎల్) లిబరేషన్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు (ఎంపీ). రైల్వే శాఖ పని తీరుపై అధ్యయన కమిటీలో సుదామ ప్రసాద్ కూడా ఉన్నారు. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (ఆర్ఐటీఈఎస్), రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) తనకు బహుమతులను పంపించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. బహిరంగంగానే నిలదీశారు. వాటిని ఎంపీ సుదామ ప్రసాద్ తనకు వద్దంటూ తిరిగి పంపించారు. కాగా రైళ్లల్లో ప్రయాణీకులకు అందుతున్న సౌకర్యాలు, సమస్యల పట్ల రైల్వేపై స్టాండింగ్ కమిటీ అధ్యయనం చేసింది.
ఈ సందర్భంగా తనకు పంపించిన గిఫ్టులు వద్దంటూ సీరియస్ గా ఎంపీ సీఎం రమేష్ కు లేఖ రాశారు. ఇది వైరల్ గా మారింది. ఒక గ్రాము బంగారు నాణెంతో పాటు 100 గ్రాముల వెండి బ్లాక్ ను పంపించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ సుదామ ప్రసాద్. ఎవరైనా పువ్వులు, శాలువాలు, పెయింటింగ్ లు , కొన్ని జ్ఞాపకాలను సాధారణంగా బహుమతులుగా ఇస్తారు. కానీ ఆర్ఐటీఈఎస్, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ద్వారా తనకు ఇచ్చిన బహుమతులు మరింత బాధ కలిగించాయని పేర్కొన్నారు ఎంపీ . ఈ చర్య అనైతికమని, పూర్తిగా ప్రజస్వామ్య స్పూర్తికి విరుద్దమని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు ప్రజలకు సంబంధించిన క్లిష్టమైన సమస్యలను లేవనెత్తకుండా ఎంపీలను చేస్తాయని అభిప్రాయపడ్డారు.
ఇటువంటి బహుమతులు ఇచ్చినందుకు ఆశ్చర్యానికి గురయ్యానని పేర్కొన్నారు ఎంపీ. భారతీయ రైల్వేలో భాగంగా నైతికత గురించి ప్రశ్నించానని స్పష్టం చేశారు. సాధారణ ప్రయాణీకుల పట్ల చాలా చులకన భావం ఉంది రైల్వే శాఖలో అని ఆవేదన చెందారు. ప్రస్తుతం నడుపుతున్న రైళ్లలో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని వాపోయారు. ఈ ధోరణి మారాలని స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. వందే భారత్ తప్పా కొత్త రైళ్లు ఏవీ ప్రవేశ పెట్టక పోవడం దారుణమని పేర్కొన్నారు ఎంపీ సుదామ ప్రసాద్.
ప్రధానంగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వక పోవడం, కాంట్రాక్టు ఉద్యోగులపై వేధింపులు, పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలో రైలు సేవలు అందక పోవడం వంటి ప్రధాన అంశాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనకు అందజేసిన బంగారం, వెండి నాణాలను కమిటీ సభ్యుల ముందు తిరిగి ఇవ్వాలని స్టాండింగ్ కమిటీ చైర్మన్ ను కోరారు సుధామ ప్రసాద్. ఆయన నిజాయితీ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. నిజంగా ఇలాంటి ఎంపీ ఉన్నందుకు తను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులు అని చెప్పక తప్పదు. సుధామ ప్రసాద్ ను చూసైనా ఎంపీలు బుద్ది తెచ్చుకోవాలి.