
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు
తిరుపతి : తిరుపతిలోని కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం టిటిడి తరఫున టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు.కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి తిరు కల్యాణం సందర్భంగా టిటిడి తరఫున పట్టు వస్త్రాలు అందజేశారు. ప్రతి ఏడాదీ బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి చైర్మెన్ కు ఆలయ ఈవో పెంచెల కిషోర్ కుమార్, ఏఈవో రవీంద్ర బాబు, అర్చకులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణం చేసి గర్భాలయంలో స్వామి వారికి వస్త్ర సమర్పణ చేశారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాధం, బొక్కసం ఇంఛార్జి గురురాజ స్వామి, సిబ్బంది పాల్గొన్నారు. అంతకు ముందు వరసిద్ది వినాయక స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఇటీవలే అన్నదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.