
పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని చెరువుల పునరుద్ధరణ పనులు వేగంగా జరగాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. మొదట విడత చేపట్టిన 6 చెరువుల పునరుద్ధరణ త్వరగా పూర్తి కావాలన్నారు. ఈ క్రమంలో ఇటీవల అంబర్పేటలోని బతుకమ్మకుంట, పాతబస్తీలోని బమృక్నుద్దౌలా చెరువులను సందర్శించారు. సున్నం చెరువును పరిశీలించారు. అలాగే నార్సింగ్ వద్ద సీఎస్ ఆర్ (సామాజిక బాధ్యత) లో భాగంగా తత్వ రియల్ ఎస్టేట్ సంస్థ చేపట్టిన ముష్కి చెరువును కూడా తనిఖీ చేశారు. సున్నం చెరువులో డెబ్రీస్ను తొలగించే పనులను పర్యవేక్షించారు. చెరువులోకి వరద నీరు నేరుగా చేరేందుకు వీలుగా వెంటనే ఇన్లెట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. చెరువు పై భాగంలోని ప్రాంతాల్లో వరద సాఫీగా కిందకు సాగడంలేదనే ఫిర్యాదుల నేపథ్యంలో చెరువు ఇన్లెట్ల పనుల ఆవశ్యకతను వివరించారు. అలాగే మురుగు కాలువ డైవర్షన్ పనులు కూడా పూర్తి కావాలన్నారు. ఈ వర్షాకాలంలోనే చెరువుల పునరుద్ధరణ జరగాలని సూచించారు.
సీఎస్ ఆర్ (సామాజిక బాధ్యత) కింద పలు సంస్థలు సమకూరుస్తున్న నిధులు పూర్తి స్థాయిలో సద్వినియోగం కావాలని హైడ్రా కమిషనర్ సూచించారు. నార్సింగ్, మణికొండ మున్సిపాలిటీలో సీఎస్ ఆర్ కింద అభివృద్ధి చెందుతున్న ముష్కి చెరువును పరిశీలించారు. ముష్కి చెరువు బండ్ పేరిట ఎఫ్టిఎల్ ప్రాంతంలో పోసిన మట్టిని యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఆదేశించారు. ఆ పనుల్లో జాప్యం జరగకుండా హైడ్రా మిషనరీని కూడా దించాలని అధికారులకు సూచించారు. చెరువును పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని స్థానికులు ఈ సందర్భంగా కమిషనర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. చెరువులో మురుగు నీరు కలవకుండా చూడాలని, చెరువు బండ్పై భారీ మొత్తంలో మొక్కలను నాటి.. గ్రీనరనీ అభివృద్ధి చేయాలన్నారు. పార్కును కూడా అభివృద్ధి చేస్తే ఇక్కడ అనేక నివాసప్రాంతాలవారికి ఎంతో వెసులుబాటుగా ఉంటుందని కమిషనర్ను కోరారు.