
నిప్పులు చెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి : మాజీ సీఎం జగన్ రెడ్డిపై భగ్గుమన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు తనకు లేదన్నారు. యూరియా కొరత లేదని, సమృద్దిగా ఉందన్నారు. కావాలని ఆధారాలు లేని ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. తన మీడియా ద్వారా పక్కదారి పట్టించేలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రయత్నాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఖరీఫ్ సీజన్కు 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రభుత్వం ముందు జాగ్రత్తగా 7.19 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ చేసిందని తెలిపారు. ఇప్పటి వరకు 6.41 లక్షల మెట్రిక్ టన్నులు రైతులకు సరఫరా చేశామని ఇంకా 78 వేల మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ ఉందని చెప్పారు. సెప్టెంబర్ 22 నాటికి మరో 55,115 మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి వస్తున్నాయని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
జగన్మోహన్ రెడ్డి బతుకే అవినీతి, నీ పార్టీ అవినీతి అంటూ విమర్శలు గుప్పించారు. యూరియాలో రూ.250 కోట్ల అవినీతి జరిగిందని జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, రైతులకు ఇచ్చే దానిపై ఎవరైనా అవినీతి చేస్తారా అని ప్రశ్నించారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70 శాతం యూరియా మార్క్ఫెడ్ ద్వారా, 30 శాతం ప్రైవేటు డీలర్ల ద్వారా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఎక్కడా అధిక ధరలు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు. జగన్ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని, అయినప్పటికీ తమ ప్రభుత్వం వాటిని అధిగమించడానికి కృషి చేస్తోందని వివరించారు. మిర్చి, కొబ్బరి, నల్లబార్లీ, టమోటా, ఉల్లి వంటి పంటలకు ధరలు తగ్గినప్పుడు తమ ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మామిడి ధర తగ్గితే ఒక్క మామిడి కాయనైనా కొన్నావా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఉల్లి ధరలు పడి పోయినప్పుడు కనీసం సమీక్ష కూడా చేయని జగన్, నిత్యం ప్రజల గురించి, రైతుల గురించి పనిచేస్తున్న తమ ప్రభుత్వాన్ని విమర్శించడం దౌర్భాగ్యమని అన్నారు.