
సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం
అమరావతి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోందని మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టమాటా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కనీస మద్దతు ధర లభించడం లేదన్నారు. ఈ సందర్బంగా ఘోరంగా వైఫల్యం చెందారంటూ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావంటూ ఎద్దేవా చేశారు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా అని ప్రశ్నించారు. రూపాయిన్నరకే కిలో టమోటానా ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా అని ప్రశ్నించారు జగన్ రెడ్డి. కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపించక పోవడం దారుణమన్నారు.
ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా అని ప్రశ్నించారు. ఇక ప్రభుత్వం ఉండికూడా ఏం లాభం అని అన్నారు. ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్టే కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాలు ఉల్లిని రూ.1200కు కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారని అది ఒట్టిదేనని తేలి పోయిందన్నారు. కానీ తూతూ మంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారని మండిపడ్డారు. ఎవ్వరూ కొనడం లేదని, ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది అని భగ్గుమన్నారు.. ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతరత్రా స్టోర్ లో ఆన్లైన్ లో నెట్లోకి వెళ్లి చూస్తే స్టోర్లో కిలో రూ.29 నుంచి రూ.32కు ఎలా అమ్ముతున్నారని ప్రశ్నించారు.