
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియంత లెక్క లాగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా సచివాలయానికి రావడం లేదన్నారు. స్కూల్లు, కాలేజీలు బంద్.. ఆరోగ్యశ్రీ సేవల రద్దు, యూరియా కొరత, అంగన్వాడీ వర్కర్ల, రేషన్ డీలర్ల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయని ఇప్పటి వరకు స్పందించిన పాపాన పోలేదన్నారు. ఇలా అన్ని వర్గాల పైన నియంతృత్వం తో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలతో ముడుపులు కలెక్ట్ చేయడం, దోచుకుని ఢిల్లీకి పంపించడమే రేవంత్ రెడ్డి ఏకైక పని అని ఆరోపించారు.
రీజినల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ తమ ప్రభుత్వం ఉన్నప్పుడు రూపొందించడం జరిగిందని చెప్పారు. గురువారం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ సొంత ప్రయోజనాల కోసం మార్చుతోందని ఆరోపించారు. ఫోర్త్ సిటీ దగ్గరలో ఉన్న తమ భూముల కోసం అలైన్మెంట్ మార్చడంతో రీజినల్ రింగ్ రోడ్ స్వరూపం మారి పోయిందని మండిపడ్డారు. అనేక మంది రైతన్నలు తమ భూములు కోల్పోతున్నారని వాపోయారు. రూ. 12 వేల కోట్లు డ్రగ్స్ దొరికితే రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం సమాచారం లేక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు పోలీసులు , ఇంటెలిజెన్స్, ఈగల్ టీంలు ఏం చేశాయని ప్రశ్నించారు కేటీఆర్. దేశంలోనే రెండవ అతిపెద్ద డ్రగ్స్ రాష్ట్రంలో దొరకడం దారుణం అన్నారు. మరి హైడ్రా ఏం చేస్తోందంటూ మండిపడ్డారు.