
ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. బతుకమ్మ, దసరా కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. గురువారం ఎండీ మీడియాతో మాట్లాడారు. ఈ పండుగల కోసం 7,754 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్పెషల్ బస్సులు నడుపుతామన్నారు. అక్టోబర్ 5–6 తేదీలలో తిరుగు ప్రయాణానికి అదనపు బస్సులు తిరుగుతాయని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది లేని ప్రయాణాన్ని కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు ఎండీ.
టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులలో 377 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాలు ఉంటాయని తెలిపారు సజ్జనార్. సెప్టెంబర్ 30న సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 2న దసరాకు షెడ్యూల్ చేయడంతో ఆర్టీసీ ఈనెల 27 నుంచి అత్యధికంగా ప్రయాణీకులు జర్నీ చేస్తారని భావిస్తోంది.
తిరుగు ప్రయాణాల కోసం పండుగ జన సందోహానికి అనుగుణంగా వచ్చే నెల 5,6 తేదీలలో అదనపు బస్సులను ఎక్కువగా నడపాలని నిర్ణయించామన్నారు. హైదరాబాద్లోని ప్రధాన టెర్మినల్స్ అయిన MGBS, JBS, CBS ల నుండి, అలాగే KPHB కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్ సుఖ్నగర్, LB నగర్, అరాంఘర్ వంటి అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులు నడిపిస్తామన్నారు.
ప్రభుత్వ ఉత్తర్వు నంబర్ 16 ప్రకారం దసరా ప్రత్యేక బస్సులకు మాత్రమే ఖాళీ తిరుగు ప్రయాణాల కనీస డీజిల్ ఖర్చులను కవర్ చేయడానికి ఛార్జీలు సవరించబడతాయని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 20, 27–30, అక్టోబర్ 1, 5, 6 తేదీలలో నిర్వహించబడే సేవలపై ఈ ఛార్జీలు వర్తిస్తాయని తెలిపారు. . ఆ రోజుల్లో రెగ్యులర్ సర్వీసులు ప్రామాణిక ఛార్జీలతో నడుస్తాయన్నారు.