
శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో
తిరుపతి : తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా గర్భాలయం, ధ్వజ స్తంభం, ఉప ఆలయాలు, ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు . ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ కె.పి.చంద్రశేఖర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబరు 22 నుండి అక్టోబరు 2వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి అమ్మ వారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇందుకోసం ఆలయంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలకు సెప్టెంబరు 22న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు గణపతి పూజ, పుణ్యాహ వచనం, అంకురార్పణ, నవ కలశ స్థాపన, వాస్తుపూజ నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా సెప్టెంబరు 23న శ్రీ కామాక్షి దేవి, సెప్టెంబరు 24న శ్రీ ఆది పరాశక్తి, సెప్టెంబరు 25న మావడి సేవ అలంకారం, సెప్టెంబరు 26న శ్రీ గాయత్రి అలంకారం, సెప్టెంబరు 27న బాల త్రిపుర సుందరి, సెప్టెంబరు 28న శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు, సెప్టెంబరు 29న శ్రీఅన్నపూర్ణాదేవి, సెప్టెంబరు 30న శ్రీ మహిషాసురమర్థిని, అక్టోబరు 1న శ్రీ సరస్వతి దేవి, అక్టోబరు 2న శ్రీ శివపార్వతుల అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబరు 2న చివరిరోజు శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో సాయంత్రం 6 గంటలకు పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, దేవి భాగవతంపై పురాణ ప్రవచనం, లలిత సహస్రనామ పారాయణం కార్యక్రమాలు నిర్వహిస్తారు.