
సంచలన ప్రకటన చేసిన ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. పలు పార్టీలపై వేటు వేసింది. కోలుకోలేని షాక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా 474 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఏపీ, తెలంగాణలలో 25 పార్టీలు రద్దయ్యాయి. వీటిలో జయప్రకాశ్ నారాయణ్ స్థాపించిన లోక్ సత్తా పై కూడా వేటు వేసింది. ఇది తెలుగు వారిని షాక్ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఎన్నికల సంఘం ఈ ప్రక్షాళన ప్రక్రియను గత కొంతకాలంగా కొనసాగిస్తోంది. గత ఆగస్టు నెలలో కూడా 334 పార్టీలను ఇదే విధంగా జాబితా నుంచి తొలగించింది. దీంతో కేవలం రెండు నెలల వ్యవధిలోనే మొత్తం 808 పార్టీల రిజిస్ట్రేషన్ను రద్దు చేసినట్లయింది. త్వరలోనే మరో 359 పార్టీలను కూడా తొలగించనున్నట్లు ఈసీ సంకేతాలిచ్చింది. వాటిలో ఏపీకి చెందిన 8, తెలంగాణకు చెందిన 10 పార్టీలు ఉండనున్నాయి. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
తెలంగాణ నుంచి తొలగించిన పార్టీలలో ఆలిండియా ఆజాద్ పార్టీ, ఆలిండియా బీసీ ఓబీసీ పార్టీ, బీసీ భారతదేశం పార్టీ, భారత్ లేబర్ ప్రజాపార్టీ, లోక్సత్తా పార్టీ, మహాజన మండలి పార్టీ, నవభారత్ నేషనల్ పార్టీ, తెలంగాణ ప్రగతి సమితి పార్టీలు ఉన్నాయి. ఇక ఏపీ నుంచి ఈసీ రద్దు చేసిన పార్టీలలో భారతీయ చైతన్య పార్టీ, జై సమైక్యాంధ్ర పార్టీ, రాయలసీమ పరిరక్షణ సమితి, ఆలిండియా లిబరల్ పార్టీ, భారత్ ప్రజా స్పందన పార్టీ, ఆలిండియా మంచి పార్టీ, భారతీయ సధర్మ సంస్థాపన పార్టీ, వెనుకబడిన వర్గాల మహిళా రైతు పార్టీ, వైఎస్ఆర్ బహుజన పార్టీ, గ్రేట్ ఇండియా పార్టీ, జై ఆంధ్రా పార్టీ, పేదరిక నిర్మూలన పార్టీ, పేదల పార్టీ, ప్రజాపాలన పార్టీ, సమైక్య తెలుగు రాజ్యం పార్టీ, రాయలసీమ కాంగ్రెస్పార్టీ, పొలిటికల్ ఎసెన్షియల్ అండ్ యాక్యురేట్ కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ పార్టీలు ఉన్నాయి.