
ఫిల్మ్ ఛాంబర్ ముందు భారీ ఎత్తున నిరసన
హైదరాబాద్ : సినీ కార్మికుల కోసం ప్రభుత్వం కేటాయించిన చిత్రపురి కాలనీ స్థలం ఆక్రమణకు గురవుతోందంటూ న్యాయం చేయాలని కోరుతూ సినీ రంగానికి చెందిన కార్మికులు ఆందోళన చేపట్టారు.
కార్మికుల భూములను చట్టవిరుద్ధంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్న వారి అప్రజాస్వామిక చర్యలపై మండిపడ్డారు. ఫిల్మ్ ఛాంబర్ నాయకులు, చిత్రపురి కమిటీ, సమాఖ్యలోని కొంతమంది నాయకులు సినిమా కార్మికుల నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ చిత్రపురి భూమిని అక్రమంగా విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం సినిమా కార్మికుల సంక్షేమం కోసం చిత్రపురి భూమిని కేటాయించింది. అయితే ప్రస్తుత సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, ఇతర పెద్దలతో కలిసి ఆ భూమిలో 4,400 చదరపు అడుగుల విలాసవంతమైన ఫ్లాట్లను నిర్మించి, ఫిల్మ్ ఛాంబర్లోని నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శనకారులు, స్టూడియో రంగానికి చదరపు అడుగుకు రూ. 7,000 కు విక్రయించడానికి కుట్ర పన్నారని కార్మికులు ఆరోపించారు. కోట్ల రూపాయల అవినీతి లావాదేవీలు జరుగుతున్నాయని, కొంతమంది అధికారులు, వ్యక్తులు దీనికి మద్దతు ఇస్తున్నారని తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు సినీ కార్మికులు.
ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాలు ప్రజాస్వామ్య విలువలపై దాడి అని బాధితులు పేర్కొన్నారు. ఎన్నికలు నిర్వహించకుండా, చిత్రపురి కమిటీని రద్దు చేయకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని మండిపడ్డారు. సినిమా పరిశ్రమలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించాల్సిన సమాఖ్య, కొద్దిమంది స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తోందని, దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. చిత్రపురి కార్యకర్తలు చట్టబద్ధంగా పోరాడుతున్నామని, కార్మికుల హక్కులను కాపాడాలని దృఢంగా నిశ్చయించుకున్నామని చెప్పారు.