
సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటన
పల్నాడు జిల్లా : చెత్తనే కాదు చెత్త రాజకీయాలను శుభ్రం చేస్తానని ప్రకటించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కోసం పల్నాడుకు వచ్చాను. స్ఛచ్చాంధ్ర అంటే చెత్తను తొలగించి రాష్ట్రాన్ని పరిశుభ్రంగా చేయడం. గత ప్రభుత్వం లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను రోడ్లపై వదిలేసి పోయిందన్నారు. చెత్త పైనా పన్ను వేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్నుతో పాటు వారు వదిలి వెళ్లిన చెత్తనూ తొలగించాం అన్నారు. రోడ్లపై చెత్తతో పాటు చెత్త రాజకీయాలను క్లోజ్ చేస్తానని చెప్పారు. ప్రజాగ్రహం ఎలా ఉంటుందో ఎన్నికల్లో చూశాం. 33 వేలకు పైగా మెజారిటీతో మాచర్ల చరిత్రలో లేని విధంగా జూలకంటి బ్రహ్మారెడ్డిని ప్రజలు గెలిపించారు. మాచర్ల పేరు వినగానే నాకు తోట చంద్రయ్య, జాలయ్య, నంబూరి శేషగిరిరావు లాంటి ప్రజాస్వామ్య వీరులు గుర్తొస్తారు. కత్తి మెడపై పెట్టినా కూడా జై చంద్రబాబు అంటూ చంద్రయ్య ప్రాణాలు వదిలాడు. జాలయ్యను అతి కిరాతంగా హతమార్చారు. ప్రజాస్వామ్యం కోసం నంబూరి శేషగిరిరావు పోరాడారు. వారందరికీ నిండు మనసుతో నివాళులు అర్పిస్తున్నాను అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
పల్నాడు జీవనాడి 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు, 1 లక్ష మందికి తాగునీరు అందించే వరికపుడిశెలను పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శ్రీకారం చుడితే వాటిని పూర్తి చేసే అవకాశం భగవంతుడు నాకిచ్చాడు. వరికపుడిశెల మొదటి దశలో 1.54 టీఎంసీలు, రెండో దశలో 6.32 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. పోలవరం పనులు నేను 74 శాతం పూర్తిచేస్తే గత ఐదేళ్లలో జగన్ రెడ్డి వచ్చి దానిని ధ్వంసం చేశాడు. ప్రజా వేదికతో కూల్చివేత మొదలు పెట్టి పోలవరం డయా ఫ్రాంవాల్ కొట్టుకు పోయేలా చేశారు. మేం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020 నాటికే పోలవరం పూర్తి అయ్యేదన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక పనులు వేగవవంతం అయ్యాయి. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం. రాష్ట్రంలోని జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. శ్రీకాకుళంలో ఉన్న వంశధారను, గోదావరి, కృష్ణా, రాయలసీమలో పెన్నా నదిని అనుసంధనం చేస్తామన్నారు. ఇప్పటికే గోదావరి కృష్ణా నదిని అనుసంధానించాం. త్వరలోనే గోదావరి వంశధారను అనుసంధానం చేసి పెన్నాను కూడా కలుపుతాం పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందించే బాధ్యతను తాసు చూసుకుంటానని చెప్పారు.