
స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ముంబై : ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరంతో పాటు టాప్ లాసిజిస్టిక్ కంపెనీ అమెజాన్కు అతిపెద్ద క్యాంపస్ తెలంగాణలోనే ఉందని తెలుసు కోవాలని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ (టీ-హబ్) హైదరాబాద్లో ఉందన్నారు. కేవలం 10 సంవత్సరాల్లోనే తెలంగాణ ఇన్ని చేయగలిగినప్పుడు, మిగతా భారతదేశం ఎందుకు చేయలేక పోయిందని కేటీఆర్ నిలదీశారు. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల వంటి వారు అమెరికన్ కంపెనీలకు సీఈవోలు అయితే మనం సంతోషిస్తాం కానీ, మన దేశం నుంచి ఒక్క ప్రపంచ స్థాయి ఆవిష్కరణ కూడా రాలేదన్న విషయాన్ని గుర్తుంచు కోవాలన్నారు.మనకు వెంచర్ క్యాపిటల్ కాదు, అడ్వెంచర్ క్యాపిటల్ కావాలన్నారు. దేశంలోని 38 కోట్ల జెన్-జీ యువత సరికొత్త ఆలోచనలతో ప్రపంచ గతిని మార్చేందుకు ప్రభుత్వాలతో కలిసి పని చేయాలన్నారు.
పెట్టుబడి లేక పోవడం కాదు మీ ఊహాశక్తి, ఆశయాలే మిమ్మల్ని ఆపుతున్నాయంటూ యువతలో కేటీఆర్ స్ఫూర్తి నింపారు. ప్రస్తుతం తెలంగాణలో రీకాల్, రిగ్రెట్, రివోల్ట్ నడుస్తోందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుతో ప్రజలు పోల్చి చూసుకుంటున్నారని (రీకాల్) అన్నారు. బీఆర్ఎస్ను గెలిపించు కోనందుకు బాధపడుతన్నారని పేర్కొన్నారు. త్వరలోనే అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడే అవకాశం ఉందని జోష్యం చెప్పారు. జెన్-జీ ఆలోచనలు, దేశ యువత ఆకాంక్షలు, ప్రభుత్వాల పాత్ర వంటి అంశాలపై తనదైన శైలిలో అద్భుతంగా ప్రసంగించి సభికులను ఆకట్టుకున్నారు. ప్రస్తుత తరం యువత (జెన్-జీ) కేవలం డిజిటల్ మీడియాకే పరిమితం కావద్దని,, సమాజం పట్ల అపారమైన బాధ్యతతో పని చేయాలని పిలుపునిచ్చారు. జెన్-జీ శక్తిని తక్కువ అంచనా వేయద్దని పాలకులను హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 400 ఎకరాల అటవీ భూమిని అమ్మాలని ప్రయత్నిస్తే, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అద్భుతంగా పోరాడి ప్రభుత్వ మెడలు వంచిన విషయాన్ని గుర్తు చేశారు.