
సింగరేణి కార్మికులకు సర్కార్ శాపం
హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కాంగ్రెస్ సర్కార్ పై దుమ్మెత్తి పోశారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణి కార్మికుల బోనస్ పేరుతో బోగస్ చేసిందంటూ రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కార్మికులకు ఇచ్చే లాభాల్లో 50 శాతానికి పైగా కోత విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థ పరంగా సింగరేణి మొత్తం రూ. 6394 కోట్ల లాభాలు గడించిందని కానీ కేవలం రూ.2360 కోట్లలో 34 శాతం ఇవ్వడం ఏమిటని నిలదీశారు సర్కార్ ను. దసరా పండుగ పూట కార్మికులకు చేదు కబురు చెప్పారంటూ ముఖ్యమంత్రి రేవంత్పై ధ్వజమెత్తారు. సమైక్య రాష్ట్రంలో అయినా, ఇప్పుడైనా సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ చేసింది ద్రోహమే అని వ్యాఖ్యానించారు.
నమ్మి ఓటేసినందుకు సింగరేణి కార్మికులను నయ వంచన చేసిందని అన్నారు హరీశ్ రావు. బీఆర్ఎస్ పాలనలో సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశామని, కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చాక నిట్ట నిలువునా మోసం చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవనే విషయం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైందని చెప్పారు హరీశ్ రావు. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పి, తీవ్ర నిరాశకు నెట్టి వేశారంటూ వాపోయారు. మొత్తం లాభంలో కొంత మొత్తమే బోనసగా ప్రకటించడం దారుణమన్నారు. పంచాల్సిన వాటాను తగ్గించి, శాతాలు పెంచి సింగరేణి కార్మికులను మోసం చేశారని ఫైర్ అయ్యారు.గతేడాది కూడా ఇదేవిధంగా మోసం చేసి, బోనస్లో 50 శాతం వాటా కోత విధించారని అన్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ ఎప్పుడైనా నికర లాభంలో కార్మికులకు వాటా ఇచ్చారని చెప్పారు.