
వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం తగదని ఆగ్రహం
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ సాక్షిగా వైసీపీని ఏకి పారేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందజేస్తామన్నారు. విభజన జరిగాక ఏపీకి తమ హయాంలో 1,819 మెడికల్ సీట్లను తెచ్చామన్నారు. 2014-19 మధ్య కాలంలో 1,212 సీట్లు వస్తే, 2024-25లో మరో 607 సీట్లు తీసుకొచ్చామని పేర్కొన్నారు. గత పాలకులు 2019-2024 మధ్యన కేవలం 452 సీట్లు మాత్రమే తేగలిగారని అన్నారు. గత ప్రభుత్వం రూ.8480 కోట్లతో 17 మెడికల్ కాలేజీలను నిర్మిస్తామని చెప్పిందన్నారు. ఐదేళ్లల్లో వాళ్లు పెట్టిన ఖర్చు కేవలం రూ.1,550 కోట్లు మాత్రమే ఉందన్నారు. ఇది మొత్తం ఖర్చులో 18 శాతం. కూటమి అధికారంలోకి వచ్చాక 15 నెలల కాలంలోనే రూ.787 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. ఇది మొత్తం ఖర్చులో 9 శాతం అన్నారు. 5 ఏళ్లలో 18 శాతం మాత్రమే ఖర్చు చేసిన వాళ్లు ఏడాదిలోనే 9 శాతం ఖర్చు పెట్టిన మాపై నిందలేస్తున్నారని మండిపడ్డారు.
గత పాలకుల తరహాలో కాలేజీల నిర్మాణం చేపడితే మరో 15 ఏళ్ల సమయం పడుతుందన్నారు సీఎం. అప్పటి వరకు కాలేజీలు ప్రారంభించ వద్దా..? పేదలకు సేవలు అందించ వద్దా అని నిలదీశారు చంద్రబాబు నాయుడు. పార్వతీపురం కాలేజీకి అసలు టెండర్లే పిలవ లేదన్నారు. కానీ నిర్మించేశామని ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. గత ప్రభుత్వ విధానం ప్రకారం కన్వీనర్ కోటాలో ప్రతి కాలేజ్ లో 64 సీట్లు మాత్రమే ఉంటే కూటమి ప్రభుత్వం 75 సీట్లు ఇస్తోందన్నారు. అంటే గత ప్రభుత్వానికంటే.. ప్రతి కాలేజీలో 11 సీట్లు ఎక్కువగా పేదలకు అందుబాటులోకి తెస్తున్నాం అని చెప్పారు ముఖ్యమంత్రి. మొత్తంగా పీపీపీ విధానంలో నిర్మించే 10 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో అదనంగా 110 సీట్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. తమ విధానం వల్ల కన్వీనర్ కోటా సీట్లు పెరిగాయన్నారు. ఇదీ పేదలపై కూటమి ప్రభుత్వానికున్న అభిమానం, చిత్తశుద్ధి అని చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే కొందరు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
విమర్శలు చేసేవాళ్లు పీపీపీ అంటే ఏంటో తెలుసుకోవాలని అన్నారు. 33 ఏళ్ల తర్వాత కాలపరిమితి ముగియగానే ఆ ప్రాజెక్టు ప్రభుత్వానికి తిరిగి వస్తుందన్నారు. జేగూరుపాడు విద్యుత్ ప్రాజెక్టు కాలపరిమితి ముగిశాక ఇప్పుడు ప్రభుత్వం చేతికి వచ్చేసిందన్నారు. యూపీ, ఒడిషా, ఝార్ఖండ్ రాష్ట్రాలు పీపీపీ పద్దతిలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నాయని చెప్పారు చంద్రబాబు నాయుడు. ఇవే కాకుండా ఐఐటీ చెన్నై, ఉదయ్ పూర్, నాగపూర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు పీపీపీలోనే కొన్ని ప్రాజెక్టులు చేపట్టాయన్నారు. అంత మాత్రాన అవి ప్రైవేటీకరణ కాదు. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా పీపీపీ విధానం ప్రాచుర్యంలోకి వచ్చిందని అన్నారు.