
200 CSR-338 రైఫిల్స్ సరఫరా చేయనుంది
హైదరాబాద్ : కేంద్ర సాయుధ బలగాల సంస్థ సీఆర్పీఎఫ్ కు హైదరాబాద్ కేంద్రంగా అధునాతన చిన్న ఆయుధాలను తయారు చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) గ్రూప్ సంస్థ ఐకామ్ 200 CSR-338 స్నైపర్ రైఫిల్స్ ను సరఫరా చేయనుంది. ఈ ఏడాది చివరినాటికి సరఫరా పూర్తి కానుంది. ఈ మేరకు సి ఆర్ పి ఎఫ్ – ఐకామ్ – కారకాల్ మధ్య ఒప్పందం కుదిరింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన ఎడ్జ్ గ్రూప్ సంస్థ కారకాల్ ఇంటర్నేషనల్తో ఐకామ్ సంస్థ సైనిక దళాలకు, భద్రతా సిబ్బందికి అవసరమయ్యే చిన్నపాటి ఆయుధాలను తయారు చేసే సాంకేతికతను పొందేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. భారత్–యూఏఈ రక్షణ భాగస్వామ్యంతో భాగంగా, కారకాల్తో కలిసి ఐకామ్ ఈ ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్లో ఆధునిక చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. అక్కడే ఈ రైఫిల్స్ ఉత్పత్తి చేసి సి ఆర్ పి ఎఫ్ కు అందజేయనున్నారు. అదనంగా, కారకాల్ ఇక్కడ తయారైన విస్తృత శ్రేణి ఆయుధాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తుంది.
CSR-338 స్నైపర్ రైఫిల్స్ లాపువా మాగ్నమ్ కాలిబర్తో, హై-పర్ఫార్మెన్స్ బోల్ట్-యాక్షన్ కలిగి ఉంటాయి. వీటిలో 27 అంగుళాల బ్యారెల్, 10 రౌండ్ల మ్యాగజైన్, ఇరువైపులా ఉపయోగించగలిగే మ్యాగజైన్ రిలీజ్ & సేఫ్టీ మెకానిజం, రెండు దశల అడ్జస్టబుల్ ప్రిసిషన్ ట్రిగ్గర్, నాలుగు స్థాయిలలో సర్దుబాటు చేసుకునే టెలిస్కోప్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.