
తక్షణమే రేషన్ డీలర్ల కమిషన్ చెల్లించాలి : హరీశ్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణం
హైదరాబాద్ : రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు సంబంధించి చెల్లించాల్సిన కమీషన్ చెల్లించక పోవడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరక్ష్య వైఖరిపై ధ్వజమెత్తారు. మంగళవారం తనను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు రేషన్ డీలర్లు. తమను పట్టించు కోవడం లేదంటూ వాపోయారు. ఈ సందర్బంగా హరీశ్ రావు వారికి భరోసా ఇచ్చారు. నెలల తరబడి రేషన్ కమీషన్ చెల్లించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం అన్నారు. పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తూ, వారి ఆకలి తీర్చుతున్న రేషన్ డీలర్లకు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల తీరుతో పస్తులుండే పరిస్థితి రావడం శోచనీయం అన్నారు.
రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించిన కమీషన్ అందక వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుండటం దారుణం అన్నారు హరీశ్ రావు. అభయహస్తం పేరిట విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో రేషన్ డీలర్లకు రూ. 5 వేల గౌరవ వేతనంతో పాటు కమీషన్ పెంపు చేస్తామని ప్రకటించారని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సోయి లేకుండా ఉంటే ఎలా అని ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో నమ్మించి, ఇప్పుడు నట్టేట ముంచారని మండిపడ్డారు హరీశ్ రావు. మాటలు తప్ప చేతలులేని కోతల ప్రభుత్వం ఇదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సచివాలయానికి రేషన్ డీలర్లను ఆహ్వానించి వారి సమస్యలను విని పరిష్కరించామన్నారు. మెట్రిక్ టన్నుకు ఇచ్చే కమీషన్ను 900 నుంచి 1400 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. ప్రభుత్వంపై రూ. 139 కోట్ల అదనపు భారం పడుతున్నా రేషన్ డీలర్ల సంతోషం కోసం కేసీఆర్ సంచలన నిర్ణయం ఆనాడు తీసుకున్నారని గుర్తు చేశారు.