
తిరుమలలో భారీ ఎత్తున వసతి సముదాయం
తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నూతన వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్బంగా దీనిని ప్రారంభించారు సీఎం, ఉప రాష్ట్రపతి. పీఏసీ 5ను రూ.102 కోట్ల వ్యయంతో టీటీడీ నిర్మించింది. ఎలాంటి ముందస్తు బుకింగ్ లేకుండా వచ్చిన భక్తులకు వసతి కల్పించేందుకు గానూ నూతన వసతి సముదాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ భవనం ద్వారా ఒకేసారి 4 వేల మంది భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించేలా నిర్మించారు. ఈ నూతన వసతి సముదాయంలో 16 డార్మిటరీలు, 2400 లాకర్లు, 24 గంటలూ వేడినీటి సదుపాయం తదితర సౌకర్యాలతో ఈ పిలిగ్రిమ్స్ అమెనిటీస్ సెంటర్ 5 ను తీర్చిదిద్దారు.
అంతే కాకుండా ఒకేసారి 80 మంది భక్తులు తలనీలాలు సమర్పించేందుకు వీలుగా కల్యాణ కట్టను కూడా ఏర్పాటు చేసింది టీటీడీ. ఈ పీఏసీ 5 ప్రాంగణంలో ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది లేకుండా చేసింది. ఒకేసారి 1400 మంది భక్తులు భోజనం చేసేందుకు వీలుగా ఈ కాంప్లెక్సులో రెండు భారీ డైనింగ్ హాళ్లను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇదిలా ఉండగా ఈనెల 24 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఎక్కడ చూసినా గోవింద నామ స్మరణ వినిపిస్తోంది. ఈవో సింఘాల్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు.