మెట్రో రైలు ఇక తెలంగాణ ప్ర‌భుత్వ ప‌రం

వైదొలిగేందుకు ఒప్పుకున్న ఎల్ అండ్ టి

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని మెట్రో రైలు నిర్వ‌హ‌ణ ఇక నుంచి తెలంగాణ స‌ర్కార్ ప‌రం కానుంది. ఈ మేర‌కు సీఎం ఆధ్వ‌ర్యంలో కీల‌క చ‌ర్చ‌లు జ‌రిగాయి. త‌మ‌కు మెట్రో రైలు నిర్వ‌హ‌ణ భారంగా మారిందంటూ ఎల్ అండ్ టి చేతులెత్తేసింది. ఈ మేర‌కు కేంద్రానికి లేఖ రాసింది. దీంతో సీఎం ప్ర‌భుత్వ ప‌రం చేసుకోవాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు రూ. 13,000 కోట్ల అప్పుతో పాటు రూ. 2000 కోట్ల ఈక్విటీని చెల్లించేందుకు ఓకే చెప్పారు. వీటిని చెల్లించాక మెట్రో రైలు పూర్తిగా స‌ర్కార్ ప‌రం అవుతుంది.

ఇదిలా ఉండ‌గా 2014లో దేశంలో మెట్రో రైలు నెట్‌వర్క్ లో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్‌, ప్రస్తుతం తొమ్మిదవ స్థానానికి పడిపోయింది. హైదరాబాద్‌ గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ రద్దీ, ప్రజా రవాణా అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను విస్తరించే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఫేజ్‌ 2A, 2B విస్తరణలో భాగంగా ఎనిమిది కొత్త మెట్రో లైన్ల ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దాదాపు 163 కిలోమీటర్ల మేరకు మెట్రోను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం పంపిన మెట్రో విస్తరణ ప్రతిపాదనలన్నీ కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే పలు మార్లు సమావేశాలు నిర్వహించిన కేంద్రం ప్రైవేట్‌ భాగస్వామ్యంతో నడుస్తున్న ఫేజ్‌ 1 మెట్రోకు, ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఫేజ్‌ 2 విస్తరణకు సంయుక్త కార్యాచరణ అవసరమని సూచించింది. అందుకు వీలుగా ఒప్పందం (Definitive Agreement) కావాలని కేంద్రం స్పష్టం చేసింది. ఫేజ్‌ 2లో కూడా ఎల్ అండ్ టీ భాగస్వామ్యం ఉండాల్సి ఉంటుందని సూచించింది.

కేంద్రం అభ్యంతరాల నేపథ్యంలో నెలకొన్న ప్రతిష్ఠంభనను అధిగమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, మెట్రో ఫేజ్‌ 2లోనూ ఎల్ అండ్ టీ భాగస్వామ్యం పంచుకుంటే బాగుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగినంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ఫేజ్‌ 1 మరియు ఫేజ్‌ 2 కారిడార్ల మధ్య సంయుక్త కార్యాచరణకు ఖచ్చితమైన ఒప్పందం అవసరమని ముఖ్యమంత్రి సూచించారు.

ఈ ఒప్పందం కుదిరితేనే విస్తరించే రైలు కార్యకలాపాలు సజావుగా సాగుతాయని, ఆదాయ వ్యయాల భాగస్వామ్యంలో స్పష్టత ఉంటుందని సీఎం అన్నారు. రవాణా సంబంధిత వ్యాపారం నుంచి కంపెనీ తప్పుకున్నందు వల్ల కంపెనీ ఈక్విటీ భాగస్వామిగా ఉండలేదని ఎల్ అండ్ టీ సీఎండీ అన్నారు. 2002 జులై 22న కుదిరిన రాయితీ ఒప్పందం ప్రకారం ప్రభుత్వం అంగీకరించిన రూ. 3,000 కోట్ల వడ్డీ లేని రుణంలో రూ.2100 కోట్లు బకాయి ఉందని గుర్తు చేశారు.

చర్చల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్‌ 1 మెట్రో ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆర్థిక ఒప్పందాలు, చట్టపరమైన నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో మెట్రో రెండో దశ విస్తరణ వేగవంతమవుతుందని, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు, ఆమోదం తొందరగా వచ్చే అవకాశముందని సీఎం అభిప్రాయపడ్డారు.

  • Related Posts

    కేటీఆర్ పై క‌క్ష సాధింపు చ‌ర్య త‌గ‌దు

    సీఎం రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్న హ‌రీశ్ హైద‌రాబాద్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కావాల‌ని క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారంటూ ఇది మంచి ప‌ద్ద‌తి…

    స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుతాం

    ధీమా వ్య‌క్తం చేసిన ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మెజారిటీ స్థానాలు సాధించి తీరుతామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేంద‌ర్. క‌రీనంగ‌ర్ జిల్లాలో ఆయ‌న ప‌ర్య‌టించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *