
అంగరంగ వైభవోపేతంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల : తిరుమలలో అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా ఉత్సవాల సందర్బంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. ఆకట్టుకునేలా చేశాయి.
ఇదిలా ఉండగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ జానపద నృత్యాలు, కళారూపాలకు అద్భుత వేదికగా నిలిచాయి. శుక్రవారం ఉదయం సింహ వాహనసేవలో వివిధ రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన వైవిధ్యమైన కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మొత్తం 9 రాష్ట్రాలకు చెందిన 20 బృందాలు, 557 మంది కళాకారులు పాల్గొని వాహనసేవ వైభవాన్ని మరింతగా పెంచారు.
గుస్సడీ నృత్యం (తెలంగాణ), తిప్పని (గుజరాత్), లవణి (మహారాష్ట్ర), భరతనాట్యం, నవదుర్గ, కూచిపూడి (ఆంధ్రప్రదేశ్), బిహు నృత్యం (అస్సాం), సంపల్పురి నృత్యం (ఒడిశా), గౌరాసుర్ (ఝార్ఖండ్), శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం (కర్ణాటక), ఢాక్ నృత్యం (పశ్చిమ బెంగాల్) మొదలైన కళా ప్రదర్శనలు భక్తులకు అపూర్వమైన అనుభూతిని కలిగించాయి.