
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉన్న మేధోశక్తిని ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం గ్రూప్-1 అభ్యర్థులకు దక్కిందని అన్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. యువకుల పోరాటంతోనే రాష్ట్రాన్ని సాధించుకున్నామనీ, వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో భాగంగానే ప్రజా ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నదని అన్నారు. గత పాలకులు అనేక విధాలుగా అవహేళన చేస్తూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి రాక్షసుల్లాగా అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నా, దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. సంపదను అందరికీ సమానంగా పంచడం, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఫ్యూచర్ సిటీని నిర్మించి, మూసీ ప్రక్షాళన చేస్తామని తెలిపారు. పేద కుటుంబాల నుంచి ఎన్నికైన గ్రూప్-1 అభ్యర్థుల నియామ కపత్రాలు అడ్డుకునే వారికి ఈ కార్యక్రమంతో చెంపదెబ్బ కొట్టినట్టేనని అన్నారు.
అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా ఉద్యోగాలు చేయాలని సీఎస్ రామకృష్ణారావు అన్నారు. గ్రూప్-1 నియామకాల ప్రక్రియ తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని చెప్పారు. సీఎం, పీఎంలు దిశా, దశ చూపిస్తే సైనికులుగా పనిచేసేది అధి కారులు, ఉద్యోగులేనని అన్నారు. ప్రజా సంక్షేమమే ఉద్యోగులకు పరమావధిగా ఉండాలన్నారు. అనంతరం గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన వారితో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీలు బలరాం నాయక్, అనిల్కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, వేం నరేందర్రెడ్డి, డీజీపీ జితేందర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మెన్లు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.