
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
పెనుకొండ/శ్రీ సత్యసాయి జిల్లా : ఏపీలో ఇక నుంచి ప్రతి సంవత్సరం కూటమి సర్కార్ మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తాము కూడా ఏటా ఉచిత డీఎస్సీ శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. డీఎస్సీ అంటేనే టీడీపీ అని, టీడీపీ అంటేనే డీఎస్సీ అని వెల్లడించారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ జగన్ నిరుద్యోగ యువతను అయిదేళ్ల పాటు దగా చేశారని మండిపడ్డారు. బుధవవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఇటీవల మెగా డీఎస్సీలో పెనుకొండ నియోజక వర్గం నుంచి టీచర్ పోస్టులు సాధించిన 70 మంది అభ్యర్థులకు మంత్రి సవిత ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
2025 మెగా డీఎస్సీలో టీచర్ పోస్టులు సాధించిన 15,941 మంది అభ్యర్థులకు ఇటీవల సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పుడు తన తొలి సంతకం మెగా డీఎస్సీ నిర్వహణ ఫైల్ పై పెట్టిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కేవలం 150 రోజుల్లో డీఎస్సీ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసిన ఘనత మంత్రి నారా లోకేష్ దేనన్నారు. మెగా డీఎస్సీని అడ్డుకోడానికి వైసీపీ నాయకులు 105కు పైగా కోర్టుల్లో కేసులు వేశారన్నారని ఆరోపించారు. వాటన్నింటినీ అధిగమించి డీఎస్పీ నిర్వహించిన ఘనత లోకేశ్ దేన్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో 15 ఏళ్లలో 14 సార్లు డీఎస్సీని నిర్వహించి, 1,96,619 టీచర్ ఉద్యోగాలిచ్చారన్నారు. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీ కోసం బీసీ అభ్యర్థులకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా ఆరు వేల మందికి ఉచిత శిక్షణ అంద జేశామన్నారు. వారిలో 270 మంది టీచర్ ఉద్యోగాలు సాధించడంపై మంత్రి సవిత ఆనందం వ్యక్తంచేశారు.