
అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవం
తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో ఘనంగా కొనసాగుతున్నాయి. గురువారం వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. టీటీడీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. భక్తులు స్వామి దర్శనం కోసం పోటెత్తారు. శ్రీవారి ఆలయంలో పవిత్రాలు, డ్రైఫ్రూట్లు, రోజా మాలల అలంకారంతో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ఆలయంలోని రంగనాయకుల మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రకాల ఫలాలు, పుష్పాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించారు.
నీలి పవిత్రాలు, లవంగాలు, వట్టివేరు, తులసి, డ్రైఫ్రూట్లు, రోజామాలలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించారు. వివిధ రంగుల పుష్పాలు, ఫలాలు, సాంబ్రాణి, ధూపదీప నైవేద్యాల నడుమ రంగ నాయకుల మండపం నూతనత్వాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు కొబ్బరినీళ్లు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. వేద పండితులు చతుర్వేద పారాయణం ఆలపించారు. బ్రహ్మోత్సవాల సమయంలో వాహన సేవల్లో తిరు వీధుల్లో ఊరేగి అలసి పోయే స్వామి వారు స్నపన తిరుమంజనంతో సేద తీరుతారని ఆలయ అర్చకులు తెలిపారు. శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్ పర్యవేక్షణలో కంకణభట్టర్ శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగార్, టిటిడి ఈవో అనిల్కుమార్ సింఘాల్, జేఈవో వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు.