
అశ్వ వాహనంపై భక్తులకు అనుగ్రహం
తిరుమల : తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి అశేష జన వాహనికి దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. వాహనం ముందు గజ రాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్లు వేద మంత్రాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణ యజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వ వాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలి దోషాలకు దూరంగా ఉండాలని, నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు . కాగా బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం ఉదయం 6 నుండి 9 గంటల వరకు స్వామిపుష్కరిణిలో స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించారు. రాత్రి 8.30 నుండి 10 గంటల వరకు ధ్వజావరోహణం జరుగనుంది.
వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, సివిఎస్వో మురళికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.