
సంచలన ఆరోపణలు చేసిన షర్మిల
విజయవాడ : హామీలు ఇవ్వడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మించి పోయాడని మండిపడ్డారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ సర్కార్ ను తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత YCP ప్రభుత్వం ఓనర్ కం డ్రైవర్ కింద 2.60 లక్షల మందికి మాత్రమే వాహన మిత్ర ఇచ్చిందని ఎద్దేవా చేశారు. 13 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే 10 శాతం మందికి కూడా పథకం దక్కలేదని మండిపడ్డారు. అర్హతలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీలు ఇచ్చారని, కానీ ఇప్పుడు వాటికి మంగళం పాడారని ఆరోపించారు. ఆటోలలో తండ్రీ కొడుకులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరగడం విడ్డూరంగా ఉందన్నారు.
అన్ని మాటలు చెప్పి 15 వేల పథకాన్ని కేవలం 2.90 లక్షల మందికే ఎలా ఇచ్చారు చంద్రబాబు అంటూ నిలదీశారు వైఎస్ షర్మిలా రెడ్డి. రాష్ట్రంలో బ్యాడ్జి కలిగిన డ్రైవర్ల సంఖ్య RTA లెక్కల ప్రకారం సుమారు 15 లక్షలకు పైగా ఉన్నారని చెప్పారు. పోనీ మీ లెక్క ప్రకారం 13 లక్షల మంది బ్యాడ్జి కలిగిన వారికి కాకుండా మీరు కూడా 10 శాతం మందికే ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించారు. మీరు సైతం ఓనర్ కం డ్రైవర్ విధానాన్ని ఎందుకు ఎంచుకున్నారంటూ ఫైర్ అయ్యారు. ఆటో తోలుకొని బ్రతికే వారిని ఎలా విస్మరించారంటూ ఆవేదన చెందారు. పథకంలో కోత పెట్టేందుకు 18 నిబంధనలు ఎందుకు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిలా రెడ్డి.
గత ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో 30 వేల మందికి అదనంగా ఇచ్చిన మీరు 13 లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఉద్ధరించినట్లా అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 13 లక్షల మంది డ్రైవర్లకు పథకాన్ని వర్తింప చేయాలన్నారు. ట్యాక్సీ డ్రైవర్లకు,హెవీ వెహికల్ లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్క డ్రైవర్ కి కూడా 15 వేలు ఇవ్వాలన్నారు.