
మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ కామెంట్స్
హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పీజీ వైద్య సీట్లలో విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు న్యాయం చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీజీ వైద్య సీట్లకు సంబంధంచి 85 శాతం లోకల్స్ కే కేటాయిస్తున్నారని, కానీ తెలంగాణ వరకు వచ్చేసరికి అది పాటించడం లేదన్నారు. కేవలం 15% సీట్లు మాత్రమే నాన్-లోకల్ విద్యార్థులకు కేటాయించారని తెలిపారు. ఆ విధానంతో ఏపీ రాష్ట్ర విద్యార్థులకు పీజీ సీట్లలో పెద్ద ఎత్తున లాభం జరుగుతోందన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఇలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో మన రాష్ట్ర విద్యార్థుల అవకాశాలను ఇతర రాష్ట్రాల విద్యార్థులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు హరీశ్ రావు.
దీని వల్ల 450 పీజీ సీట్లు మొత్తం ఆల్ ఇండియా కోటాకు వెళ్ళి పోతున్నాయంటూ వాపోయారు. ఏపీ తరహాలో రిజర్వేషన్ కల్పిస్తే, ఈ 450 సీట్లలో 68 సీట్లు మాత్రమే ఆల్ ఇండియా కోటాకు వెళ్తాయని తెలిపారు. మిగిలిన 382 సీట్లు తెలంగాణ విద్యార్థులకు లభిస్తాయన్నారు. కానీ ఈ రిజర్వేషన్ లేకుండా ప్రవేశాల ప్రక్రియ కొనసాగిస్తే, 382 పీజీ సీట్లు తెలంగాణ విద్యార్థులు శాశ్వతంగా కోల్పోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్యలో అవకాశాలు పెంచడానికి జిల్లాల వారీగా మెడికల్ కాలేజీలను ప్రారంభించామన్నారు. స్థానిక విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అడ్మిషన్ రూల్స్లో సవరణలు చేసి, 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటైన కాలేజీల్లోని 100% సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేసిన విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. 520 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకు దక్కాయన్నారు. బీ కేటగిరీ సీట్లలో 85% స్థానిక రిజర్వేషన్ వల్ల 1300 సీట్లు ప్రతి సంవత్సరం అదనంగా లభించినట్లు తెలిపారు. మొత్తంగా 1,820 అదనపు ఎంబీబీఎస్ సీట్లు ప్రతి ఏటా తెలంగాణ విద్యార్థులకు వచ్చాయన్నారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక సీన్ మారిందన్నారు.