
శ్రీపట్టాభిరామ స్వామివారి ఆలయంలో
తిరుపతి : అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
మొదటి రోజు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, అర్చన నిర్వహించారు. ఉదయం 7 గంటలకు యాగశాల పూజ చతుష్టార్చన, హోమం, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటల నుండి యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అక్టోబరు 6న ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, అక్టోబరు 7న ఉదయం యాగశాల పూజ, మహాపూర్ణాహుతి, స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి తిరువీధి ఉత్సవం, పవిత్ర వితరణతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
గృహస్తులు (ఇద్దరు) రూ.300/- చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రం, స్వామివారి తీర్ధ ప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి, నాగరాజు ఆలయ అర్చకులు కృష్ణ ప్రసాద్ బట్టర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.