
ఆక్రమణలపై ఎక్కువగా వచ్చాయన్న రంగనాథ్
హైదరాబాద్ : హైదరాబాద్ లో రోజు రోజుకు ఆక్రమణలు పెరిగి పోతుండడం పట్ల నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ మేరకు తమకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. హైడ్రా ఆధ్వర్యంలో ప్రజా వాణి చేపట్టారు. ఈ కార్యక్రమానికి బాధితులు, నగరవాసుల నుంచి 41 ఫిర్యాదులు తమకు అందాయని తెలిపారు . శేరిలింగంపల్లి మండలం మాధాపూర్లోని అయ్యప్ప సొసైటీలో 28వ ప్రధాన రహదారి వాస్తవానికి 60 అడుగుల వెడల్పుతో ఉండగా.. కొంతమంది డబ్బాలు పెట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారని, అంతేకాకుండా వసతి గృహాలను నిర్మించారని, దీనికి ఎలాంటి పర్మిషన్ లేదన్నారు. ఈ విషయం గురించి తమకు ఫిర్యాదు చేశారన్నారు కమిషనర్. డబ్బాలను తొలగించాలని హైకోర్టు ఆదేశాలున్నాయని, ఆ ప్రకారం గతంలో తొలగించగా.. ఇటీవల మళ్లీ వాటిని పెట్టి రోడ్డును కబ్జా చేసేశారని ఫిర్యాదు చేశారన్నారు. ఖాళీ చేయమంటే తమను బెదిరిస్తున్నారని లేని పక్షంలో రూ. 40 లక్షలు డిమాండ్ చేస్తున్నారని వాపోయారన్నారు.
మేడ్చల్ జిల్లా బూరంపేట గ్రామం సర్వే నంబరు 166/3 లోని ప్రభుత్వ భూమిలో దాదాపు కిలోమీటరు మేర 60 మీటర్ల వెడల్పులో రహదారి నిర్మించి పైన ఉన్న వెంచర్లకు దారి చూపుతున్నారని వెంటనే ఆక్రమణలను ఆపాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని కిలోమీటర్ల మేర కబ్జా జరుగుతోందని వాపోయారు. రంగరెడ్డి జిల్లా హయత్నగర్ మండలం ఆదిత్యనగర్ – బాలాజీ నగర్ మధ్య రెండు లింకు రోడ్డులు ఆక్రమణకు గురయ్యాయని, పార్కు స్థలం కూడా కబ్జాకు గురైందని వెంటనే ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జా కాకుండా చూడాలని ఆదిత్యనగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రాను కోరారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం సాయిప్రియానగర్లో 2500ల ప్లాట్లతో లే ఔట్ వేశారని తెలిపారు. ఇందులో 2 వేల గజాల పార్కు ఒకటి ఉండగా దానిని కూడా ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారని సాయి ప్రియా నగర్ నివాసితులు పిర్యాదు చేశారన్నారు ఏవీ రంగనాథ్.