యూపీఏ హయాంలో రెండు పవర్ ఫుల్ చట్టాలు
హైదరాబాద్ : సమాచార హక్కు చట్టం 2005 తో పాటు జాతీయ ఉపాధి హామీ చట్టం తీసుకు వచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ చట్టం ప్రజలకు ప్రభుత్వ విభాగాల సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చి పాలనలో పారదర్శకత, బాధ్యతాయుతమైన విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. ఆదివారం గాంధీ భవన్ లో ఆయన మాట్లాడారు. సరిగ్గా ఇదే రోజు ఆర్టీఐ చట్టంగా అమలులోకి వచ్చిందన్నారు. ఈ చట్టం ఇప్పటికే వచ్చి 20 సంవత్సరాలు అవుతోందన్నారు.
అటవీ హక్కుల చట్టం (2006),విద్య హక్కు చట్టం (2009), భూసేకరణ న్యాయమైన పరిహారం చట్టం (2013), ఆహార భద్రత చట్టం (2013) లో చట్టాలు ప్రజలకు సంపూర్ణ హక్కులను యుపిఎ ప్రభుత్వం కల్పించిందని చెప్పారు.
2014 నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం RTIకి తూట్లు పొడుస్తూ వస్తోందని ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్. 2019 సవరణలతో సమాచారం కమిషన్ల స్వతంత్రతను బలహీన పరిచాయని ఆరోపించారు. కమిషనర్ల పదవీకాలం (5 సంవత్సరాలు) సేవా షరతులను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేలా మార్పులు జరిగాయన్నారు. స్వయం ప్రతిపత్తి తో నిర్వహించే RTI కమిషనర్లు కేంద్రం ఒత్తిడిలకు తల్లోగే పరిస్థితి నెలకొందన్నారు. 2023 – డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం తీసుకు రావడంపై స్పందించారు.
RTI సెక్షన్ 8(1)(j)లో సవరణలతో వ్యక్తిగత సమాచారం అనే నిర్వచనం విస్తరించ బడిందన్నారు.
దీని వల్ల ఓటరు జాబితాలు, ప్రభుత్వ నిధుల వినియోగం, ఖర్చుల వివరాలు లాంటి ప్రజా ప్రయోజన సమాచారం దాచిపెట్టే అవకాశం పెరిగిందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్. కేంద్ర సమాచారం కమిషన్ ప్రస్తుతం 11 పోస్టులకు బదులుగా కేవలం 2 కమిషనర్లతోనే పని చేస్తోందని అన్నారు. 2025 సెప్టెంబర్ తర్వాత చీఫ్ కమిషనర్ పదవి కూడా ఖాళీగా ఉందన్నారు. భోపాల్కు చెందిన పర్యావరణ కార్యకర్త షెహ్లా మసూద్ అక్రమ మైనింగ్ బహిర్గతం చేయడంతో కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు.






