సిగ్గు ఉంటే పాలనపై పట్టు నిరూపించుకోవాలి
హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తను పాలనా పరంగా పట్టు కోల్పోయారని అన్నారు. మంత్రులు సైతం ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారని , బాజాప్తాగా కమీషన్లకు అలవాటు పడ్డారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని దావూద్ ఇబ్రహీంతో పోల్చారు కేటీఆర్. ముఖ్యమంత్రిని తరిమేస్తేనే తెలంగాణకు పట్టిన శని పోతుందన్నారు. కాంగ్రెస్ అవినీతికి ప్రభుత్వ అధికారులు కూడా భయ పడుతున్నారని ఆరోపించారు . వీరి వాటాల పంచాయతీలో మాకు భాగస్వామ్యం వద్దు, మాకు సంబంధం లేదు అంటూ అధికారులు పారిపోతున్నారని అన్నారు.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తప్పుడు పనులు చేయమని వేధించడం వల్లనే వారు వాలంటరీ (వీఆర్ఎస్) తీసుకుంటున్నారని ఆరోపించారు. మంచి అధికారులు కూడా పారిపోయేలా చేసే దండుపాళ్యం ముఠా రాష్ట్రంలో ఉందన్నారు కేటీఆర్. దండుపాళ్యం ముఠానే రాష్ట్రాన్ని నడిపిస్తున్నదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులు దండుపాళ్యం ముఠా గా ఏర్పడ్డారన్నారు. తను చెప్పిన పని చేయలేదని చెప్పి రిజ్వీ వీఆర్ఎస్ తీసుకుంటే కూడా, ఆయన రాజీనామా ఆమోదించవద్దని జూపల్లి కృష్ణారావు కోరిన విషయం వాస్తావం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు, అక్రమాలలో భాగస్వాములు అయితే రాబోయే రోజుల్లో జైలుకు వెళ్లక తప్పదన్నారు కేటీఆర్. రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తున్నదని అన్నారు.






