సంచలన ఆరోపణలు చేసిన మంత్రి సవిత
అమరావతి : మంత్రి ఎస్. సవిత సంచలన ఆరోపణలు చేశారు జగన్ రెడ్డిపై. కూటమి ప్రభుత్వం ప్రతిష్టకు భంగం కలిగేలా తాడేపల్లి ప్యాలెస్ లో కల్తీ మద్యం తయారీ ప్రణాళికలు రచిస్తున్నారని విమర్శించారు. నకిలీ మద్యం తయారీకి జోగి రమేష్, ఏ-1 జనార్దన రావు జగన్ ఇంటిలోనే ప్రణాళికలు రచించారన్నారు. రాష్ట్రంలో అలజడి, అశాంతిని సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నారని వైసీపీ నాయకులపై సవిత విమర్శలు గుప్పించారు. అయిదేళ్ల జగన్ పాలనలో కల్తీ మద్యం అక్రమాలు బయట కొస్తుండడంతో, డైవర్షన్ రాజకీయాలకు వైసీపీ నాయకులు తెర తీశారన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ, అమ్మకాలపై సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని మంత్రి సవిత వెల్లడించారు. జగన్ హయాంలో మూడు లక్షలకు పైగా బెల్ట్ షాపులుంటే, ప్రస్తుతం వాటిని పూర్తిగా మూయించామని తెలిపారు.
బెల్ట్ షాపు తెరిస్తే రూ.5 లక్షల ఫైన్ వేస్తున్నామన్నారు. మొలకల చెరువు మద్యం తయారీ ఘటనపై ఇప్పటికే అయిదుగురు ఐపీఎస్ లతో సిట్ ఏర్పాటు చేశామని, త్వరలోనే వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని వెల్లడించారు. కల్తీ మద్యం ఆరోపణలు రాగానే, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన జయచంద్రారెడ్డిని, కట్టా సురేంద్రనాయుడిని సీఎం చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. ఇదీ తమ పార్టీకి, ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని అన్నారు. కల్తీ మద్యంలో నిందితులుగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, ఇతర వైసీపీ నాయకులను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని మంత్రి ప్రశ్నించారు. జగన్ కు, తాడేపల్లి ప్యాలెస్ కు కల్తీ మద్యం పాత్ర ఉండబట్టే, వారిని వెనుకేసు కొస్తున్నారన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని అడ్డుకట్ట వేయడానికి సురక్షా యాప్ రూపొందిస్తున్నామన్నారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, చిత్తూరులో నూతన మద్యం పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.






