రౌడీ షీటర్ ను ఎన్నికల్లో నిలబెడితే ఎలా..?
హైదరాబాద్ : బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ జూబ్లీ హిల్స్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. గురువారం తెలంగాణ భవన్ లో పార్టీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఉప ఎన్నికపై ఆరా తీశారు. ఆరు నూరైనా సరే మన సీటును మనం కాపాడు కోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే అంతులేని హామీలు గుప్పించి పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఆచరణలో పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఆ విషయాన్ని గుర్తించాలన్నారు. పెద్ద ఎత్తున దొంగ ఓట్లు కూడా నమోద య్యాయని, ఇప్పటికే బీఆర్ఎస్ ఆధారాలతో సహా బయట పెట్టిందన్నారు. అంతే కాకుండా ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.
నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ పాలనతో ఇప్పటికే రాష్ట్రం గుల్ల గుల్ల అయ్యిందని అన్నారు. ఇక జూబ్లీ హిల్స్ లో తన అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ ఓ రౌడీషీటర్ ను నిలబెట్టి హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజ్ఞులైన జూబ్లీ హిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించి, జూబ్లీహిల్స్ గౌరవాన్ని హైదరాబాద్లో శాంతి భద్రతలను కాపాడుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో దిగజారిన అభివృద్ధి గురించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులను గురించి వారికి ఇంటింటికీ తిరిగి వివరించాలని పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనా కాలంలో అమలు చేసిన అభివృద్ధికార్యక్రమాలు, మానవీయ కోణంలో అమలుచేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎందుకు మాయమయ్యాయనే విషయాన్ని ప్రజలతో కలిసి చర్చించాలని అధినేత సూచించారు.






