శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి విగ్రహం వద్ద
తిరుపతి : అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలోని శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి (108 అడుగల) విగ్రహం వద్ద శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రతిష్టా కుంభాభిషేక మహోత్సవానికి టిటిడి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. అంకురార్పణంలో భాగంగా విశ్వక్సేన ఆరాధనం, యాగ సంకల్పం, భగవత్పుణ్యాహం, రక్షాబంధనం, వాస్తుహోమం, పర్యగ్నికరణము, పంచగవ్యప్రోక్షణం, మృత్యుంగ్రహణం, ధ్వజ కుంభారాధనములు, అఖండ దీపస్థాపనము, యాగమంటపబలి, మంగళహారతిలను ఆగ మోక్తంగా నిర్వహించారు.
శనివారం మహాకుంభ స్థాపన, జలాధివాసం చేపట్టారు. నవంబర్ 02వ తేదీన ఆదివారం మూర్తి హోమం, స్నపన తిరుమంజనం, శయ్యాధివాసం చేపడుతారు. 03వ తేదీన ఉదయం 04 గం.టల నుండి 05 గం.ల లోపు విగ్రహ ప్రతిష్ట, అష్టబంధన సమర్పణం, ఉదయం 09 గం.లకు మహా పూర్ణాహుతి, తదుపరి మహాకుంభాప్రోక్షణ, ప్రాణ ప్రతిష్టాన్యాసములు, ప్రథమ కాలారాధనం జరుగనుంది. సాయంత్రం 06 గం.లకు శ్రీనివాస కల్యాణం వేడుకగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ధ్యాన మందిరం (108 అడుగుల విగ్రహం) వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవోలు ఎ. శివప్రసాద్, ఏ. ప్రశాంతి, ఏఈవో బాలరాజు, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.







