మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
టెక్కలి : అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెల 19న రెండో విడత నిధులు జమ చేయనున్నట్లు వెల్లడించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. టెక్కలి నియోజకవర్గంలోని నిమ్మాడ క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి , డైరెక్టర్, 26 జిల్లాల జేడీలతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు అదేరోజు విడుదల చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయనున్న నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో కలిపి మొత్తం రూ.7వేలు అందించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతుకూ అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి అందాలని, రైతులకు చేయూతనివ్వడం భారం కాదన్నారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం రెండో విడత అమలు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరగాలని అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 19న వైయస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అవసరమైన చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశించారు. NPCAలో ఇన్ యాక్టివ్ గా ఉన్న ఖాతాలను యాక్టివేట్ చేయాలని క్షేత్ర స్ధాయిలో వ్యవసాయ శాఖ అధికారులు సన్వయం చేసుకుని పర్యవేక్షణ చేసి వాటిని సరిచేయాలని సూచించారు. ఆర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్నదాత సుఖీభవ పథకం అర్హత ఉన్నవారు ఆన్లైన్లో రైతులు నమోదు చేసుకునే విధానాన్ని సులభతరం చేయాలని అధికారులకు సూచించారు.






