ప్రకటించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్ : ‘పీపుల్ సెంట్రిక్ డిజిటల్ గవర్నెన్స్’లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఏటా 10 లక్షల మంది తెలంగాణ యువతను ‘ఏఐ’ నిపుణులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ‘మెటా’, ‘మీ సేవ’ సంయుక్త భాగస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్’ను ఈరోజు బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణాలో ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ‘గవర్నెన్స్’ అంటే కేవలం నాలుగు గోడల మధ్య పాలించడం కాదన్నారు.
ప్రజలను పాలనలో భాగస్వామ్యం చేస్తూ… టెక్నాలజీ సాయంతో పౌర సేవలను వారి ముంగిటకే చేరుస్తూ ‘గుడ్ గవర్నెన్స్’వైపు అడుగులు వేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. ప్రభుత్వం టెక్నాలజీని కేవలం సాఫ్ట్ వేర్ గా మాత్రమే చూడటం లేదని, ఒక సమానత్వ సాధనంగా చూస్తుందన్నారు.
టెక్నాలజీ ఫలాలను రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో ఉన్న చివరి వ్యక్తి వరకూ చేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత తెలంగాణ డిజిటల్ ఎక్స్ ఛేంజ్, ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ, తెలంగాణ ఇన్నోవేషన్ హబ్ తో ‘డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్’లో తెలంగాణ ఒక బెంచ్ మార్కెట్ ను సెట్ చేస్తోందని మంత్రి అన్నారు.
తాజాగా ఇతర రాష్ట్రాలు తెలంగాణను అనుసరించేలా ‘మీ సేవ’ ద్వారా అందించే 580కు పైగా 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన పౌర సేవలను ఫింగర్ టిప్స్ పై వాట్సాప్ లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని మంత్రి అన్నారు. కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, ‘మీ సేవ’ కమిషనర్ రవి కిరణ్, ‘మెటా’ ప్రతినిధి నటాషా తదితరులు పాల్గొన్నారు.






