వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత
అమరావతి : ఏపీలో రైతుల వద్దకే పాలన తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద రెండు విడతల్లో కలిపి రూ.6,310 కోట్లు రైతులకు చెల్లించామని అన్నారు. బిందు సేద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారుల. పొలం పిలుస్తోంది కార్యక్రమం కూడా చేపడుతున్నామని పేర్కొన్నారు సీఎం. ఇలాంటి వాటితో పాటు వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా అన్నదాతలకు మరింత మేలు చేకూర్చేలా పంచ సూత్రాలను ప్రకటించామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్ధతు అనే అంశాలతో పంచ సూత్రాల విధానాన్ని చేపట్టామన్నారు.
ఈ పంచ సూత్రాలను ప్రతి రైతుకే కాకుండా రైతు కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. రైతులతో పాటు పాడి రైతులు, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం దారులు, ఆక్వా, ఉద్యాన, సెరీ కల్చర్ రైతలకూ అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని రైతు సేవా కేంద్రాల్లోని సిబ్బంది ముందుండి చేపట్టాలి. దీంతో పాటు వర్క్షాప్లు కూడా నిర్వహించాలి. ప్రతి రైతు సేవా కేంద్రాల్లో యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని దిశా నిర్దేశం చేశారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా ఆధునిక పద్ధతుల ద్వారా పంటలకు మరింత విలువ జోడించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇంటింటికీ వెళ్లి వివరించాలని సూచించారు. ప్రకృతి సేద్యాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నాం. దీని వల్ల భూసార రక్షణతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు.





