పట్టాభిరాముని అలంకారంలో దర్శన భాగ్యం
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన గురువారం రాత్రి హనుమంత వాహనంపై శ్రీ పట్టాభిరాముని అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు.
హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్య భక్తుడు. త్రేతాయుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి సీతగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని వివాహమాడింది. భూదేవి అంశ అయిన వేదవతి కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన ఆంజనేయుని కోరికను తీర్చడానికా అన్నట్టు అలమేలుమంగ బ్రహ్మోత్సవాలలో హనుమంతున్ని వాహనంగా చేసుకుంది.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జెఈఓ వి. వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, ఏఈవో దేవరాజులు, అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.






