
త్వరలో మిగిలిన బకాయిలూ చెల్లిస్తామని ప్రకటన
అమరావతి : అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేతన్నలకు మేలు చేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. తాజాగా చేనేతలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆప్కో ద్వారా నేతన్నలకు పడిన బకాయిల్లో 20 శాతం మేర చెల్లించాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. ఈ మేరకు రూ.2,00,32,615.41లను ఆప్కో అధికారులు శుక్రవారం విడుదల చేశారు. 2024 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేత పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు మంత్రి. నూతన టెక్స్ టైల్స్ పాలసీ తీసుకొచ్చామన్నారు. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయాలు పెంచేలా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో చేనేత బజార్లు నిర్వహిస్తోందన్నారు.
టాటా తనేరియా, ఆద్యం బిర్లా గ్రూప్, తమిళనాడుకు చెందిన కో ఆప్టెక్స్ తోనూ ఒప్పందం చేసుకోవడం జరిగిందని చెప్పారు ఎస్. సవిత. 93 వేల చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 11,488 మర మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్లు తెలిపారు. 50 ఏళ్లు నిండిన 92,724 మంది చేనేత కార్మికులకు రూ.4 వేల చొప్పున పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. నూలు కొనుగోలుపై 15 శాతం సబ్సిడీ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఆప్కోకు వస్త్రాలు విక్రయించే నేతన్నలకు అయిదు శాతం జీఎస్టీ మినహాయిస్తోందన్నారు. ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా రెడీమేడ్ దుస్తుల తయారీలో శిక్షణిస్తూ, ఉత్పత్తులను ఆప్కో, ఈ కామర్స్ ద్వారా విక్రయాలు చేపట్టామన్నారు. కేవలం 15 నెలల కాలంలో నేతన్నలకు ఆర్థిక భరోసా కలిగించేలా, గౌరవ ప్రదమైన జీవనం సాగించేలా కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని స్పష్టం చేశారు మంత్రి.