
అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు
అమరావతి : రాష్ట్రంలో ఎరువులు ఎటువంటి కొరత లేకుండా అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. శుక్రవారం విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ లో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా, డీఎపి, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులు సహా అన్నిరకాల ఎరువులు సరిపడా నిల్వలుగా ఉన్నాయని తెలిపారు. జిల్లా వారీగా ఎరువుల నిల్వలను పరిశీలిస్తూ, కలెక్టర్లు, వ్యవసాయ శాఖాధికారులతో ప్రతిరోజూ సమీక్షలు జరుగుతున్నాయని అన్నారు. మార్కెట్లో ఎరువుల కొరత లేకుండా, రైతుల అవసరాలకు అనుగుణంగా సరఫరాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. రైతుల కోసం కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, ఒక్క రైతు కూడా ఇబ్బందులు పడకుండా చూడటమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు అచ్చెన్నాయుడు. రైతుల సమస్యల పరిష్కారం మా మొదటి కర్తవ్యం అని మంత్రి స్పష్టం చేశారు. ఎరువుల కొరత పేరుతో రైతులను మోసం చేయాలనుకునే డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించేలా జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖాధికారులు 24 గంటలు పని చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని సహకార సంస్థలు, రైతు సేవా కేంద్రాలు, ప్రైవేట్ వ్యాపారుల వద్ద 82,054 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. వివిధ పోర్టుల నుండి , తయారీ సంస్థల నుండి 29,236, మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాలకు రవాణా దశలో ఉందన్నారు. 1,06,412 మెట్రిక్ టన్నుల యూరియా పలు పోర్టులు, తయారీ సంస్థల ద్వారా రాష్ట్రానికి సెప్టెంబర్ నెలాఖరకు చేరుకుంటాయని అన్నారు.