
క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుట్టాం
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ వైపు తాము కొలువు తీరాక పలు కంపెనీలు, దిగ్గజ సంస్థలు చూస్తున్నాయని చెప్పారు. క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుట్టామన్నారు తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్ కు అవసరమైన అనుబంధ సంస్థలు పెట్టడానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయని వెల్లడించారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ విద్యా సంస్థలు కొన్ని ఉన్నాయని, ఇంకొన్ని రాష్ట్రానికి రాబోతున్నాయని ప్రకటించారు. ఒకప్పుడు రాయలసీమలో 10 ఏళ్లల్లో 8 ఏళ్లు కరవు ఉండేదన్నారు. ట్యాంకర్లల్లో నీళ్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి రాయలసీమలో ఉండేదన్నారు. కానీ హంద్రీ నీవా కారణంగా ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఏవీ లేవన్నారు నారా చంద్రబాబు నాయుడు.
దేశంలో ఇప్పటికీ అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా అనంతపురం అని పేర్కొన్నారు. కానీ నీళ్లను ఇవ్వడంతో అక్కడ పరిస్థితి మారిందని చెప్పారు సీఎం. కోస్తా జిల్లాల కంటే అనంతపురం జిల్లానే జీఎస్డీపీలో టాప్ పొజిషన్లో ఉందన్నారు. ఇది హార్టికల్చర్ సాగు వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. నీళ్లు లేక పోయినా ఫర్వాలేదు.. రోడ్లు లేక పోయినా ఫర్వాలేదంటే మనం ఇక్కడే ఉంటామన్నారు . పైగా వృధా జలాలను మాత్రమే బనకచర్లకు వినియోగించు కుంటామని చెబుతూ వస్తున్నామని కానీ తెలంగాణలో కొందరు కావాలని తమను బద్నాం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
పెద్ద పెద్ద సంస్థలన్నీ సొంత డబ్బులతో పెడుతున్నారా అని ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకుంటున్నారని, పెట్టుబడులు పెడుతున్నారని పేర్కొన్నారు.