సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని రైతులు పడుతున్న ఇబ్బందులను పదే పదే గుర్తు చేయాల్సి రావడం చాలా బాధాకరం అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. పంటల దిగుబడి సమయంలో ఓ ముఖ్యమంత్రిగా అప్రమత్తతతో ఉండాల్సిన మీరు పూర్తి అలసత్వం వహించడం ఈ రాష్ట్ర రైతుల దురదృష్టం అని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 7 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయడం జరిగిందన్నారు. పంట కోతకు వచ్చి మక్కలను మార్కెట్లలోకి తరలిస్తున్నారని తెలిపారు. దాదాపు అన్ని మార్కెట్ యార్డులు మొక్కజొన్న నిల్వలతో నిండి పోయాయని, కానీ ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడం దారుణమన్నారు. దీంతో రైతుల శ్రమను దళారులు దోచుకుంటున్నారని ఆరోపించారు. క్వింటాలుకు రూ.2400 మద్దతు ధరతో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీరు చెల్లిస్తామన్న రూ.330 బోనస్ ను రైతులకు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు హరీశ్ రావు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అడ్డికి పావుశేరు చొప్పున రైతులు అమ్ముకునే దుస్థితి ఏర్పడిందని వాపోయారు. క్వింటాల్ మక్కలను రూ.1600కే రైతుల వద్ద నుంచి ప్రైవేట్ వ్యాపారులు కొంటున్నారని, ఫలితంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లి వారి కష్టమంతా దళారుల పాలవుతున్నదని ఆవేదన చెందారు. గత రెండు సంవత్సరాలుగా బోనస్ డబ్బులు ఊసు లేదన్నారు. ఇటు మద్దతు ధర రాక.. అటు బోనస్ లేక రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారని కానీ సీఎం స్పందించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల కష్టాలు మీ కళ్లకు కనిపించడం లేదా.. వారి రోదన మీకు వినిపించడం లేదా..!. ఢిల్లీ టూర్లు, కమిషన్లు,సెటిల్మెంట్లు పక్కనబెట్టి రైతుల బాధలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు.






