1444 గజాల పార్కు చుట్టూ హైడ్రా ఫెన్సింగ్
హైదరాబాద్ : రోజు రోజుకు హైడ్రా స్పీడ్ పెంచుతోంది. అక్రమార్కులు, భూ కబ్జాదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో ఆక్రమణలను గుర్తించే పనిలోపడింది. ఇదిలా ఉండగా తాజాగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఓల్డ్ ఆల్వాల్ పరిధి జొన్నబండలోని ఎంహెచ్ఆర్ కాలనీలో పార్కును హైడ్రా కాపాడింది. 1444.40 గజాల పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసింది. లే ఔట్ ప్రకారం సర్వే నంబర్లు 575, 576 (పార్ట్), 577, 578 (పార్ట్), 598, 580 (పార్ట్)లలో మొత్తం 1444.40 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు.
దీనిని ఆక్రమించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని స్థానికులు హైడ్రా ప్రజా వాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులతో క్షేత్ర స్థాయిలో హైడ్రా పరిశీలించింది. పార్కు స్థలంగా నిర్ధారించుకుంది. హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ప్రజలకు ప్రాణ వాయువును అందించే పార్కును కాపాడిన హైడ్రాకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. చెత్త వేయకుండా వెంటనే పార్కుగా అభివృద్ధి చేయాలని జీహెచ్ ఎంసీని కోరుతామన్నారు.






