1.12 కోట్ల కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలి
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. 2027 మార్చి నాటికి రీ సర్వే 2.0 పూర్తి చేసి 1.12 కోట్ల కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
రెవెన్యూ శాఖపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22 ఏ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే ఇతర సర్వీస్ ఇనాం లోని మరో లక్ష ఎకరాల భూములకూ విముక్తి కల్పించనున్నట్లు తెలిపారు. దీని కోసం కొత్తగా చట్టం తీసుకు రావాలని సీఎం ఆదేశించారు. 2016కు మందు ఏదైనా ప్రభుత్వ హౌసింగ్ స్కీంలో పట్టా పొందిన ప్రతి ఇంటికీ రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
దీని వల్ల దాదాపు 75 లక్షల పేద కుటుంబాలకు లబ్ది చేకూరుతుందన్నారు. ఇదే సమయంలో రహదారుల నిర్మాణంపై కూడా సమీక్షించారు. స్థానికంగా భౌగోళిక పరిస్థితులు, వాతావరణం అంశాలను పరిగణనలోకి తీసుకుని రోడ్ల నిర్వహణలో చర్యలు చేపట్టాలన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, బ్లాక్ కాటన్ సాయిల్ ఉన్న చోట హైబ్రీడ్ మోడల్ లో బీటీ లేదా వైట్ ట్యాప్ రోడ్ల నిర్మాణం చేపడితే బాగుంటుందన్నారు. కాలువలు ఉన్న 570 కిలోమీటర్ల మేర రహదారులు పదే పదే ధ్వంసం అవుతున్నాయని , ఇలాంటి ప్రాంతాల్లో ఏ మెటీరియల్తో రోడ్ల నిర్మాణం జరిగితే బాగుంటుందనేది ఆలోచన చేయాలన్నారు. దీనిపై యూనివర్శిటీల్లో అధ్యయనం చేయిస్తే కొత్త ఆవిష్కరణలు వస్తాయన్నారు.





