నిప్పులు చెరిగిన టీవీకే పార్టీ చీఫ్ విజయ్
చెన్నై : రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా డీఎంకే పాలన మారిందని సంచలన ఆరోపణలు చేశారు టీవీకే పార్టీ చీఫ్ విజయ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన దూకుడు పెంచారు. విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. జన సంద్రం మధ్య నిప్పులు చెరిగారు. తనను కావాలని కొందరు అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. కానీ వారి కుట్రలు, కుతంత్రాలు తన ముందు చెల్లవన్నారు. సినిమా రంగంలో అపారమైన అవకాశాలు, లెక్కలేనంత రెమ్యునరేషన్ వస్తున్నా తాను కాదనుకుని రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.
కేవలం తమిళనాడు రాష్ట్రాన్ని రక్షించడం కోసం , ప్రజలను బాగు చేసేందుకే తాను కంకణం కట్టుకున్నానని చెప్పారు టీవీకే విజయ్. తాను ఫీనిక్స్ లాంటి వాడినని , ఎంతగా ఇబ్బంది పెట్టినా తాను వాటిని ఎదుర్కొని ముందుకు సాగుతూనే ఉంటానని అన్నారు. రాష్ట్రంలో డీఎంకే అరాచక పాలనకు స్వస్తి చెప్పాలంటే మీరంతా విలువైన ఓటు హక్కు వినియోగించు కోవాలని పిలుపునిచ్చారు . బీజేపీ, డీఎంకే పార్టీలు బయటకు తిట్టుకున్నట్టు నటిస్తున్నాయని లోపాయికారిగా ఈ రెండు ఒక్కటేనంటూ ఆరోపించారు విజయ్.





