సత్యనారాయణ వ్రతం నిర్వహించి సంబరాలు
హైదరాబాద్ : హైడ్రాకు రోజు రోజుకు నగర వాసుల నుంచి మద్దతు పెరుగుతోంది. నిజాంపేట మున్సిపాలిటీ కోశల్యానగర్లోని హైడ్రా కాపాడిన బనియన్ ట్రీ పార్కులో స్థానికులు వన భోజనాలు చేశారు. కార్తీకమాసం కావడంతో సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. నిజాంపేట మున్సిపాలిటీలో ఇటీవల రెండు పార్కులను హైడ్రా కాపాడింది. బృందావన్ కాలనీలో 2300 గజాల పార్కును కాపాడగా, కౌశల్యానగర్ కాలనీలోని 300ల గజాల విస్తీర్ణంలో ఉన్న బనియన్ ట్రీ పార్కును కబ్జాల నుంచి రక్షించింది. కౌశల్యానగర్ కాలనీలోని 300 గజాల పార్కుకు చుట్టూ ఆక్రమణదారులు ప్రహరీ నిర్మించి కాజేశారు. ఎవరూ పార్కులోకి రాకుండా అడ్డుకున్నారు.
అలా ఆక్రమణలో వున్న పార్కును కాపాడి కోశల్యానగర్ కాలనీ వాసులకు హైడ్రా అప్పగించింది. అందుకే కాలనీవాసులు బనియన్ ట్రీ పార్కుకు చేరుకుని కార్తీక వనభోజనాలు చేశారు. అదే పార్కులో కాలనీ వాసులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం విశేషం. దాదాపు వెయ్యి మంది కలసి ఈ ఉత్సవాలను జరుపుకున్నారు. పిల్లలు పెద్దలు హైడ్రా జిందాబాద్..అంటూ హైడ్రా కి హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలియ చేసారు. ప్లకార్డులు ప్రదర్శించి హైడ్రాకు మద్దతు పలికారు. అలాగే బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీలో ఫార్చ్యూన్ మెడోస్ కాలనీలో అడ్డుగోడలు తొలగించి వెనువెంటనే సిమెంట్ రోడ్డు వేసిన హైడ్రాకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. హైడ్రా వచ్చింది దారులు తెరిచిందంటూ కీర్తించారు.






