సంచలన ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ‘ఏపీ అంటే పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించామన్నారు. ఏపీ అంటే బ్రాండ్ అనే పేరు మళ్లీ తీసుకువచ్చామని తెలిపారు. భారత్లో తొలి క్వాంటం కంప్యూటర్ వ్యాలీ అమరావతికి వచ్చిందన్నారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే అమరావతి క్వాంటం వ్యాలీకి అడ్రస్గా మారుతుందన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ ద్వారా ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టామని తెలిపారు సీఎం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా రాష్ట్రంలోని 5 జోన్లలో ఆవిష్కరణలకు, నైపుణ్యాలకు పదును పెడుతున్నాం అన్నారు. గత ప్రభుత్వంలో ఎవరికీ నైపుణ్యాలను కల్పించలేక పోయారని ఆరోపించారు. మా ప్రభుత్వంలో మానవ వనరులను అభివృద్ధి చేయటంతో పాటు అత్యుత్తమ ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుంద అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
దేశంలోనే తొలిసారి ప్రజలందరికీ వర్తింప చేసేలా యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకు వస్తున్నాం అని తెలిపారు సీఎం. రూ.2.5 లక్షల వరకూ ఉచితంగా వైద్య సేవలు అందించేలా ఈ విధానం ఉంటుందన్నారు. అతి తక్కువ వ్యయంతోనే వైద్య చికిత్సలు అందేలా చర్యలు చేపడుతున్నాం అని తెలిపారు. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు చంద్రబాబు నాయుడు. గత పాలకులు కనీసం వైద్య కళాశాలలకు భూమి కూడా చూపించలేదని ఆరోపించారు. ప్రతీ నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు సీఎం. పీపీపీ అంటే ప్రైవేటు కాదని మరోమారు ప్రజలకు చెబుతున్నాం అన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుందన్నారు. అన్ని మెడికల్ కళాశాలల్లోనూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సేవలు అందుతాయని ప్రకటించారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రతీ ఒక్కరి ఆరోగ్యం కోసం డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తున్నాం అని తెలిపారు. ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని సీఎం స్పష్టం చేశారు.





