వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి : పంటల భీమా విషయంలో గత ప్రభుత్వ విధానం వల్ల రైతులకు ఇబ్బందులు తలెత్తాయని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి పసల్ భీమా యోజనలో దేశంలోని అనేక రాష్ట్రాలు భాగస్వామ్యం అయినప్పటికీ, గత ప్రభుత్వం ఉచిత భీమా పేరుతో వేరే విధానాన్ని తీసుకు వచ్చిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం స్వయంగా ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటు చేయాలని ప్రయత్నించిందని, కేంద్ర ప్రభుత్వం ఆ విధానం సాధ్యం కాదని సూచించిందని చెప్పారు. ఐదేళ్ల కాలంలో ఒక ఏడాది మాత్రమే రైతులకు భీమా అందించ బడిందని, అనంతరం కేంద్రంతో కలిసినప్పటికీ వైసీపీ ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన సుమారు రూ.2000 కోట్లను మూడు సంవత్సరాల పాటు చెల్లించక పోవడంతో పోర్టల్ కూడా తెరవలేక పోయిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పౌరసరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక శాఖల మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించామని చెప్పారు. ప్రస్తుతం కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మళ్లీ పంటల భీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.
అరకు కాఫీ దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేశారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అరకు ప్రాంతంలోని కాఫీ తోటల్లో కాఫీ బెర్రీ బోరర్ వ్యాధి పరిమిత స్థాయిలో మాత్రమే గుర్తించ బడిందని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం సుమారు 1.03 లక్షల హెక్టార్లలో కాఫీ సాగు జరుగుతుండగా, కేవలం 60.8 హెక్టార్లలో మాత్రమే ఈ వ్యాధి ప్రభావం కనిపించిందని తెలిపారు. సమస్య గుర్తించిన వెంటనే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి శాస్త్రవేత్తలు, అధికారులు, కాఫీ బోర్డు ప్రతినిధులతో కలిసి పర్యవేక్షణ ప్రారంభించిందని చెప్పారు. వ్యాధికి గురైన 152 ఎకరాల్లోని 20,617 కిలోల కాఫీ కాయలను గుంతలు తవ్వి పాతిపెట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 530 మంది కూలీలు, ఉద్యాన, వ్యవసాయ శాఖ విద్యార్థులు, ఫీల్డ్ సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. నష్టపోయిన 81 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా రూ.7,23,825 ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. అరకు కాఫీ బ్రాండ్కు ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం అప్రమత్తంగా చర్యలు తీసుకుంటుందని, ఎక్కడైనా వ్యాధి కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని మంత్రి సభ్యులకు విజ్ఞప్తి చేశారు.





