కీలక ప్రకటన చేసిన మంత్రి ఎస్. సవిత
విజయవాడ : ఏపీ కూటమి సర్కార్ నేతన్నలకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు మంత్రి ఎస్. సవిత. ఆప్కో ఇమేజ్ పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మగ్గం మీద నేసే వస్త్రాలకు ప్రయారిటీ ఇస్తామన్నారు. దీని వల్ల వినియోగదారులకు నేతన్నలు నేసే నాణ్యమైన చేనేత వస్త్రాలు లభిస్తాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆప్కో షో రూమ్ ల్లో పవర్ లూమ్ చేనేత వస్త్రాలను విక్రయించిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. ఇకపై ఆప్కో ఇమేజ్ పెంచేలా నేటి ట్రెండ్ కు అనుగుణంగా నేతన్నలు చేనేత రెడీమేడ్ దుస్తుల తయారీపైనా దృష్టి పెట్టాలన్నారు. ఆసక్తి కలిగిన వారికి ఉచిత శిక్షణ సైతం అందిస్తున్నామన్నారు.
ఇప్పటికే ఈ కామర్స్ ద్వారా ఆన్ లైన్ అమ్మకాలు ప్రారంభించామని, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని మంత్రి సవిత వెల్లడించారు. చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు ఎస్.సవిత. దీనిలో భాగంగా నేతన్నల సమస్యల పరిష్కారంతో చేనేత రంగ అభివృద్ధిపై ఎమ్మెల్యేలు జయనాగేశ్వరరెడ్డి, జోగేశ్వరరావు, కృష్ణప్రసాద్, షాజహాన్ బాషాతో పాటు ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, అధికారులతో మంత్రి సవిత రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ భేటీ అయ్యారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల కాలంలో చేనేతల అభివృద్దికి చేపట్టిన పథకాలను మంత్రి సవిత వివరించారు. నూతన టెక్స్ టైల్స్ విధానం రూపకల్పనతో రాష్ట్రంలో చేనేత రంగానికి కొత్త శకం మొదలైందన్నారు. నేతన్నల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. ఈ సందర్బంగా పలు చేనేత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రి సవితకు ఎమ్మెల్యేలు వినతి పత్రాన్నిఅందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రధాన ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా, కమిషనర్ రేఖారాణి తదితరులు పాల్గొన్నారు.





