స్పష్టం చేసిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పేదరికాన్ని సంపూర్ణంగా రూపుమాపి, పేదల జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా జీరో పావర్టీ మిషన్ ను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సెర్ప్, మెప్మా, ఆర్టీజీఎస్ విభాగాలతో జీరో పావర్టీ మిషన్ కుటుంబ సాధికారితపై సమీక్ష నిర్వహించారు. సమీకృత వ్యూహంతో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కార్యాచరణ చేపట్టాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయ సంఘాల సంస్థలు సెర్ప్, మెప్మా, ఆర్టీజీఎస్ వ్యవస్థలను సమన్వయం చేస్తూ జీరో పావర్టీ మిషన్ ను ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. ఎస్ హెచ్ జీలకు సంబంధించి ఈ వ్యవస్థల నెట్వర్క్ ద్వారా 1.3 కోట్ల కుటుంబాల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ అంశంపై వివిధ దేశాలు రాష్ట్రాల్లో అమలు అవుతున్న అత్యుత్తమ పేదరిక నిర్మూలన విధానాలను అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. 2047 స్వర్ణాంధ్ర మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో జీరో పావర్టీ మిషన్ సమర్ధంగా చేపట్టాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన మిషన్ కు సంబంధించి కేంద్రం అమలు చేస్తున్న నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ ద్వారా వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ.1100 కోట్లును సమర్ధంగా వినియోగించుకునేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, సెర్ప్ అధికారులు పాల్గొన్నారు.





