ప్రకటించిన హెచ్ సీ ఏ ప్రెసిడెంట్
హైదరాబాద్: ప్రతిభ గల యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్)ను నిర్వహిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు వెల్లడించారు. గ్రామీణ క్రికెట్ అభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రతి జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి రూ. కోటి ఖర్చు చేస్తామన్నారు. పది ఎకరాలు కొనుగోలు చేసి కొత్త స్టేడియాలను నిర్మిస్తామని వెల్లడించారు.
ఉప్పల్ స్టేడియంలో జగన్ మోహన్ రావు అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్ సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగింది. ఉపాధ్యక్షుడు ఎస్.దల్జిత్ సింగ్, కార్యదర్శి ఆర్.దేవ్రాజ్, కోశాధికారి సీజే శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి టి.బసవరాజు, కౌన్సిలర్ కె.సునిల్ అగర్వాల్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
అపెక్స్ కౌన్సిల్లో సమష్ఠిగా తీసుకున్న నిర్ణయాలను జగన్మోహన్ రావు తెలియజేశారు. క్రికెట్ అభివృద్ధికి హెచ్సీఏ కార్యవర్గం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. తొలుత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా మేనేజర్గా ఎంపికైన దేవ్రాజ్ను మిగిలిన అపెక్స్ కౌన్సిల్ సభ్యులు అభినందించారు.
ఐపీఎల్ అనంతరం యువ క్రికెటర్ల కోసం టీపీఎల్ నిర్వహణ పనులు ప్రారంభిస్తామన్నారు. మైదానాలను లీజుకు తీసుకుని క్రికెట్ కార్యాకలాపాలు నిర్వహిస్తామని చెప్పారు జగన్ మోహన్ రావు. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్లో ఇటీవల సత్తా చాటిన తెలంగాణ క్రికెటర్లను సత్కరించేందుకు వచ్చే మార్చిలో హెచ్సీఏ అవార్డ్సు వేడుక చేయనున్నామని చెప్పారు.