ప్రకటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు
విశాఖపట్నం : భవిష్యత్తులో విశాఖపట్నంకు భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నాయని జోష్యం చెప్పారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు రావడం జరిగిందన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రూ.88 వేల కోట్లతో ఓ దేశచరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడిగా విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోందని ప్రకటించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు ఆల్గారిథమ్స్ కూడా రాసేలా మన పిల్లలు సిద్ధం అవుతున్నారని చెప్పారు సీఎం . 2047కి భారత్ నెంబర్ 1 ఆర్ధిక వ్యవస్థగా తయారవుతుందని అన్నారు. ఏపీ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ దిశ గానే విశ్వ సముద్ర మూడు ప్రాజెక్టులు చేపట్టిందన్నారు. 24 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్ రోజుకు 200 కిలోలీటర్ల ఇథనాల్ ఉత్పత్తి చేస్తోందన్నారు. దీని కోసం 15 వేల టన్నులకు పైగా పాడైన బియ్యం, నూకలు, పంట వ్యర్ధాల కొనుగోలు చేస్తోందని చెప్పారు.
దీని వల్ల రైతులకు మేలు జరుగుతోందని అన్నారు సీఎం. రైతుల సంక్షేమంతో పాటు ఇథనాల్ తయారు చేస్తూ విశ్వ సముద్ర యాజమాన్యం దేశ ప్రగతికి తోడ్పడుతోందని ప్రశంసించారు. అలాగే పశు సంపదను కాపాడేందుకు కొత్త ప్రయోగం చేయటం అభినందనీయం అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన గోవులను సంరక్షిస్తున్నారు. ఒంగోలు జాతి పశువులను సంరంక్షిచడంపై ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు చేయడమే కాకుండా.. శాస్త్రీయ పద్దతుల్లో పునరుత్పత్తికి చింతా శశిధర్ ఫౌండేషన్ పని చేస్తోందని చెప్పారు. పవర్ ఆఫ్ బుల్ అనే విధానంలో విద్యుత్పత్తి చేపట్టడం వినూత్న ప్రక్రియ. ఈ విధానం ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 5 కిలోవాట్లను ఇన్ హౌస్ అవసరాలకు వినియోగించు కుంటున్నారని తెలిపారు. ఇక నంద గోకులం లైఫ్ స్కూల్ ద్వారా ప్రతిభ కలిగిన, ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఉత్తమ విద్యను అందిస్తున్నారు. సమాజానికి తిరిగి ఇవ్వటం అనే విధానంలో భాగమే పీ4. డబ్బులు ఇవ్వటం ఒక్కటే కాదు చేయూత ఇవ్వడమనేది పీ4 విధానంలో ముఖ్యమైన అంశం అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తదితరులు హజరయ్యారు.






